1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

కోలీవుడ్‌లో విడిపోయిన మరో ప్రేమ జంట... జీవీ ప్రకాష్ - సైంధవి విడాకులు

G.V. Prakash Kumar
కోలీవుడ్ చిత్రపరిశ్రమలో మరో ప్రేమ జంట విడిపోయింది. ప్రముఖ సంగీత దర్శకుడిగా, హీరోగా రాణిస్తున్న జీవీ ప్రకాష్, గాయని సైంధవిలు విడిపోయారు. తామిద్దరం విడిపోతున్నట్టు జీవీ ప్రకాష్ సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. దీంతో వారిద్దరి 11 ఏళ్ల వైవాహిక బంధానికి త్వరలో కోర్టు ద్వారా తెరపడనుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వారు పోస్టు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడైన జీవీ ప్రకాశ్.. 2013లో తన బాల్య మిత్రురాలు సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013లో వారికి కూతురు పుట్టింది. 
 
తమ విడాకులపై జీవీ ప్రకాష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్‌లో 'చాలా ఆలోచించిన తర్వాత 'సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగు కోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం' అని జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు.