1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (17:14 IST)

ఆ రెండు సినిమాల నిలుపుదలకు హైకోర్టు నో చెప్పేసింది...

లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల విడుదల నిలిపివేయాలంటూ దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు చిత్రాల విడుదలను నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. సత్యనారాయణ వేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు సినిమాల విడుదల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
 
మహానటుడు ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెరకెక్కించాడు. ఈ చిత్రం త్వరలో సెన్సార్ కార్యక్రమాలను జరుపుకొని మార్చి 29న విడుదల కానుంది. 
 
మరోవైపు వీరగ్రంథం వెంకట సుబ్బారావు జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మీ పార్వతి..ఆ తర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించారు..అటు తర్వాత ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం’ సినిమా తెరకెక్కించారు.