శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (17:43 IST)

బిగ్ బాస్ 3.. హోస్ట్‌గా రమ్యకృష్ణ సరికొత్త రికార్డు.. హౌస్ మేట్స్‌ను ఆటాడుకుంది..

బిగ్ బాస్ మూడో సీజన్‌కు మహిళా హోస్ట్ వచ్చారు. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో భాగంగా ఈ వారం ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ కనిపించారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సోషల్ మీడియాను దున్నేస్తున్నాయి. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళ బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించి సంచలనం సృష్టించింది.
 
పుట్టిన రోజును పురస్కరించుకుని నాగ్ తన ఫ్యామిలీ వేసిన ట్రిప్ కారణంగా స్పెయిన్‌కి వెళ్లడంతో రమ్యకృష్ణ ఫ్రేమలోకి వచ్చింది. తొలిసారి బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన రమ్యకృష్ణ పర్వాలేదనిపించింది. తెలుగు అంత సరళంగా రాకపోయినా.. ఎలాగోలా మేనేజ్ చేసింది. సీజన్ 3 ఎపిసోడ్ 42లో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ.. అభిమానులకి హాయ్ చెప్తూ.. టీవీలో శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌ని చూపించింది. 
 
శుక్రవారం ఎపిసోడ్‌లో రాహుల్‌, బాబా, వరుణ్‌ కలిసి నాగార్జున గురించి సరికొత్తగా పాటని రచించారు. దీనిని రాహుల్ ఆలపించగా, మిగతా వారందరు డ్యాన్స్ చేశారు. ఈ పర్‌ఫార్మెన్స్‌కి నాగ్ కూడా ఫిదా అయ్యారు. ఇక వెంటనే ఇంటి సభ్యుల ముందు ప్రత్యక్షం అయిన రమ్యని చూసి హౌజ్‌మేట్స్ షాక్ అయ్యారు.
 
అంతలోనే నాగార్జున కూడా స్పెయిన్ నుండి లైవ్‌లో వారితో ముచ్చటించారు. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్లానని.. అందుకే బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి కాకుండా స్పెయిన్ నుండి వీడియో ద్వారా మాట్లాడుతున్నాని నాగ్ పేర్కొన్నారు. వచ్చేవారం మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని నాగ్ అన్నారు.
 
అయితే అడగగానే బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తానని రమ్య ముందుకు వచ్చినందుకు ఆమెకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నాగ్‌కి బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు హౌజ్‌మేట్స్. తొలిసారి బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తున్న రమ్యకృష్ణ ఇంటి సభ్యులతో సరదా గేమ్ ఆడించింది. ఆపై హౌస్‌లో తమకు జరిగిన అన్యాయాల గురించి చెప్పమని ఇంటి సభ్యులను కోరింది.
 
సీక్రెట్ టాస్క్‌లో రవి, రాహుల్‌, వరుణ్ సందేశ్ .. ఈ ముగ్గురు వితికాని టార్గెట్ చేయడంతో ఆమెకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇచ్చింది రమ్య. దమ్ముంటే అబ్బాయిలపై మీ పంతం చూపించాలని, అమ్మాయిలపై కాదని వారిపై ఫైర్ అయింది శివగామి. ప్రతీకారం తీర్చుకునే ప్రక్రియలో ముందుగా వరుణ్ మొహంపై కోల్డ్ కాఫీ పోయించిన రమ్యకృష్ణ ఆ తర్వాత రాహుల్ షర్ట్‌ని కట్ చేయమని చెప్పింది.
 
ఇక రవికృష్ణ బెడ్‌ని నీళ్లతో తడపమని శివజ్యోతిని ఆదేశించింది. ఇక ఎప్పుడు బట్టలు విప్పి సిక్స్ ప్యాక్స్ కనిపించేలా తిరిగే అలీకి చిన్న శిక్ష విధించింది శివగామి. ఆయన బాడీ చుట్టూ టిష్యూ పేపర్‌ని చుట్టమని పేర్కొంది. ఇక హౌజ్‌లో అల్లరి చేసే శ్రీముఖి మూతికి టేప్ అతికించమని అలీని కోరింది. 
 
బాబా భాస్కర్ తప్ప మరో వ్యక్తి కనిపించని మహేష్‌కి బాబా ఫోటోలతో ఉన్న కళ్ల అద్దాలు పెట్టకోమని చెప్పింది.. రమ్య. ఇక హిమజ.. రాహుల్‌ని తిట్టమనగా ఆమె బూతులు గుర్తు తెచ్చుకొని మరి తిట్టింది. మొత్తానికి శనివారం ఎపిసోడ్ కాస్త సరదాగానే సాగింది.

రమ్యకృష్ణ హోస్ట్‌ చేస్తున్న తీరును చూసి ఆమెనే బిగ్ బాస్ మూడో సీజన్‌కు కొనసాగించాలని కోరుతున్నారు ప్రేక్షకులు. నాగార్జున స్థానాన్ని ఆమె పూర్తిగా భర్తీ చేసిందని.. స్టార్ మాకు రేటింగ్ పెరగాలంటే.. రమ్యనే హోస్ట్‌గా వుండాలని నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.