శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (09:23 IST)

సుశాంత్ కేసులో కీలక మలుపు : ప్రియాంకపై ఫోర్జరీ కేసు పెట్టిన రియా

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సుశాంత్ సోదరి ప్రియాంకా సింగ్‌పై సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఫోర్జరీ కేసు పెట్టింది. 
 
సుశాంత్‌కు సంబంధించి బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ను ఇచ్చిందంటూ ప్రియాంకపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మానసిక ఒత్తిడికి సంబంధించిన మందులతో ఓ బోగస్‌ మందుల చీటీని సుశాంత్‌ సోదరి ప్రియాంక సింగ్‌ ఫోర్జరీ చేసిందని రియా సోమవారం ఫిర్యాదు చేశారు. 
 
ఆ మందులు వాడిన ఐదురోజులకే సుశాంత్‌ మరణించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి ప్రియాంక సింగ్‌ను, ఢిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రి డాక్టర్‌ తరుణ్‌ కుమార్‌ను ప్రశ్నిస్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపింది.
 
మరోవైపు, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల కేసులో వరుసగా రెండోరోజైన సోమవారం కూడా నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్.సి.బి) అధికారులు విచారించారు. ఈ డ్రగ్స్‌ రాకెట్‌లో రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండా, సుశాంత్‌ ఇంటి పనిమనిషి దిపేశ్‌ సావంత్‌ల పాత్ర గురించి తెలుసుకునేందుకు రియాను ప్రశ్నిస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు.