1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (17:24 IST)

అవన్నీ పుకార్లేనట.. వెంటిలేటర్‌పైనే ఎస్.పి. బాలు : తనయుడు ఎస్పీ.చరణ్

కరోనా వైరస్ బారినపడి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త కుదుటపడిందనీ, మంగళవారం వెంటిలేటర్ తొలగించినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై ఆయన కుమారుడు ఎస్.పి.చరణ్ క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిలో మార్పులేదన్నారు. కాకుంటే, నిన్నటికంటే ఈ రోజు కాస్త మెరుగ్గా వుందని చెప్పారు. అదేసమయంలో వెంటిలేటర్ తొలగించినట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. 
 
ప్రస్తుతం ఆయనను ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి వెంటిలేటర్‌పై నిపుణులతో కూడిన వైద్య బృందం చికిత్స అందిస్తోందని చెప్పారు. తన తండ్రి ఆరోగ్యం చికిత్సకు స్పందిస్తోందని, అందువల్ల ఖచ్చితంగా ఆయన తిరిగి కోలుకుంటారని తెలిపారు. పైగా, కోట్లాది మంది అభిమానుల ప్రేమాభిమానాలు, ప్రార్థనలు తన తండ్రికి శ్రీరామరక్షగా ఉంటాయని, అవి ఖచ్చితంగా తన తండ్రిని తిరిగి నడిపిస్తాయన్నారు. అందువల్ల ప్రార్థనలు కొనసాగించాలని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 
 
అంతకుముందు.. తన అన్నయ్య ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ఆయన సోదరి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ వెల్లడించారు. మునుపటితో పోల్చితే ఎంతో కోలుకున్నారని తెలిపారు. మంగళవారం వైద్యులు ఆయనకు వెంటిలేటర్ తొలగించారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే శ్వాస తీసుకోగలుగుతున్నారని వివరించారు. తన సోదరుడు చికిత్సకు స్పందిస్తున్న తీరు పట్ల వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, తన సోదరుడి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని ఎస్పీ శైలజ పేర్కొన్నారు. ఈ వార్త కేవలం పుకారేనని ఎస్.పి. చరణ్ స్పష్టం చేశారు.