శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (13:41 IST)

వాలీబాల్ టీమ్ హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ కు సహ యజమానిగా విజయ్‌ దేవరకొండ

Vijay Devarakonda
Vijay Devarakonda
దేశ వ్యాప్తంగా అశేష అభిమానగణం కలిగిన యువ సూపర్‌స్టార్‌ , ఫిలింఫేర్‌ అవార్డు, నంది అవార్డు, సైమా అవార్డు  సహా ఎన్నో అవార్డులు గెలుచకున్న విజయ్‌ దేవరకొండ ఇప్పుడు భారతదేశంలో అగ్రగామి ప్రొఫెషనల్‌ టీమ్‌లలో ఒకటైన  హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ సహ  యజమానిగా మారారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్కటీమ్‌ హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌. 
 
Vijay Devarakonda,team Hyderabad Black Hawks
Vijay Devarakonda,team Hyderabad Black Hawks
‘అర్జున్‌ రెడ్డి’ మరియు ‘పెళ్లి చూపులు ’ వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రాచుర్యం పొందిన శ్రీ విజయ్‌ దేవరకొండ , బ్లాక్‌ హాక్స్‌ టీమ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. లీగ్‌ మ్యాచ్‌లకు ఆవల ప్రచారం చేయడంతో పాటుగా అంతర్జాతీయంగా వీక్షకుల ముందుకు విభిన్నంగా  ఈ టీమ్‌ను ప్రదర్శించనున్నారు.
 
బ్లాక్‌హాక్స్‌ ముఖ్య యజమాని అభిషేక్‌ రెడ్డి కనకాల మాట్లాడుతూ ‘‘విజయ్‌ మాతో చేరడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌, సహ యజమానిగా వ్యవహరించనున్నారు.  ఆయన తనతో పాటుగా టీమ్‌కు  నూతన విధానం తీసుకురావడం వల్ల మా బ్రాండ్‌ను మరో దశకు తీసుకువెళ్లగలము. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల సంస్కృతి, స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించాలనే మా లక్ష్య సాధన దిశగా అతి పెద్ద ముందడుగనూ వేశాము. రాబోయే వాటి గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.
 
ఈ మహోన్నత భాగస్వామ్యం  గురించి శ్రీ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ బ్లాక్‌ హాక్స్‌ మరో స్పోర్ట్స్‌ టీమ్‌ అని కాకుండా అంతకు మించినది. తెలుగు వారసత్వం సగర్వంగా ప్రదర్శించాలనుకునే మా అందరికీ ఇది గర్వ కారణం. తెలుగు ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాదు, మన స్ఫూర్తి, శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మా బ్రాండ్‌ మరియు టీమ్‌ను భారతదేశం మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లేందుకు చేయాల్సినంతగా నేను చేస్తాను’’ అని అన్నారు.
 
బ్లాక్‌హాక్స్‌ లక్ష్య సాధన గురించి ఈ జంట మాట్లాడుతూ ‘‘మా లక్ష్యం, మా ప్రజలు. ప్రతి దశలోనూ వారి జీవితాలను మెరుగుపరచాలని  ప్రయత్నిస్తున్నాము. (ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌) మ్యాచ్‌ కేవలం ఆరంభం మాత్రమే. వాలీబాల్‌ను దేశంలో ప్రతి మూలకూ తీసుకువెళ్లాలన్నది మా లక్ష్యం. అన్ని వయసులు, లింగాలు, బ్యాక్‌గ్రౌండ్స్‌, అన్ని స్ధాయిల అథ్లెటిజం కలిగిన ప్రజలకు దీనిని చేరువ చేయాలనుకుంటున్నాము.  మన నగరాల్లాగానే మన గ్రామీణ ప్రాంతాలలో సైతం కమ్యూనిటీలకు తగిన సాధికారిత అందించాలనుకుంటున్నాము. అలాగే మన చిన్నారులకు సమానమైన అవకాశాలనూ అందించాలనుకుంటున్నాము. మేము వాలీబాల్‌ను కేవలం ఓ క్రీడగా మాత్రమే కాదు, దీనిని ప్రతి ఒక్కరికీ సహాయపడుతూనే , ప్రయోజనం కలిగించే రీతిలో మార్చాలనుకుంటున్నాము’’అని అన్నారు.
 
రూపే  ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ పవర్డ్‌ బై ఏ 23 అనేది ప్రైవేట్‌ యాజమాన్య నిర్వహణలోని  ఇండియన్‌ ప్రొఫెషనల్‌ వాలీబాల్‌ లీగ్‌.  హైదరాబాద్‌, అహ్మాదాబాద్‌, కోల్‌కతా, కాలికట్‌, కొచి, చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి ఎనిమిది టీమ్‌లు దీనిలో పోటీపడుతున్నాయి.
ఈ లీగ్‌ తొలి సీజన్‌ అపూర్వ విజయం సాధించింది. ఇది ఒకే సమయంలో  ఇంగ్లీష్‌ , హిందీ,  తమిళం, తెలుగు, మలయాళం భాషలలో  ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్‌లు మొత్తంమ్మీద 41 మిలియన్‌ టెలివిజన్‌ వ్యూయర్‌ షిప్‌ నమోదు చేయడంతో పాటుగా 43 మిలియన్‌ స్ట్రీమింగ్‌ వ్యూయర్‌షిప్‌ నమోదు చేసింది. అదనంగా, ఈ సీజన్‌ పలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ వ్యాప్తంగా 5 మిలియన్‌ ఫ్యాన్‌ ఎంగేజ్‌ మెంట్స్‌ను సొంతం చేసుకుంది.  దీనితో పాటుగా భారీ ప్రాంతీయ కనెక్షన్స్‌ను సామాజిక మాధ్యమ  వేదికలైనటువంటి షేర్‌చాట్‌ , మోజ్‌ ద్వారా పొందింది.
ఈ లీగ్‌ రెండవ సీజన్‌లో 31 మ్యాచ్‌లు 04 ఫిబ్రవరి నుంచి 05 మార్చి వరకూ జరుగనున్నాయి. దీనిని భారతదేశంలో  ప్రత్యేకంగా సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌  తమ సోనీ స్పోర్ట్స్‌ 1, 3, 4లలో ప్రసారం చేయడంతో  పాటుగా  సోనీ లివ్‌పై స్ట్రీమింగ్‌ చేయనుంది.  అంతర్జాతీయంగా ఈ మ్యాచ్‌లు వాలీబాల్‌ వరల్డ్‌ స్ట్రీమ్‌ చేయనుంది.  వాలీబాల్‌ యొక్క గ్లోబల్‌ గవర్నింగ్‌ బాడీ , ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డి వాలీబాల్‌ (ఎఫ్‌ఐవీబీ) యొక్క వాణిజ్య విభాగం ఇది.