సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం
సుధీర్ బాబు హీరోగా సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మాతలుగా తెరకెక్కుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో శనివారం నాడు జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్ శంకర్, మైత్రీ నిర్మాత రవిశంకర్, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు మోహన ఇంద్రగంటి, శిల్పా శిరోధ్కర్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు.
జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. జీ స్టూడియోస్లో రూపొందుతోన్న జటాధర థ్రిల్లింగ్ సూపర్ నేచురల్గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ని అందించే సినిమా ఇది అని అన్నారు.
జటాధర సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతోంది.
జటాధర యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ఆడియెన్స్ ముందుకు రానుంది. థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో జటాధరాను ఉత్కంఠభరితంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. జటాధరలో నిధి కోసం పోరాటం జరుగుతుంది.. కానీ పోరాడాలంటే కొన్ని శాపాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పోరాటం ఏంటి? ఈ శాపం ఏంటి? అని తెలియాలంటే ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందే.