శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (15:53 IST)

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించిందా? నాసా వ్యోమగామి ఏం చెప్పారు?

జాబిల్లి దక్షిణ ధృవం పరిశోధన నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 ద్వారా పంపిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా రంగంలోకి దించింది. ఇందుకోసం నాసా లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ)ను మంగళవారం చంద్రుడిపైకి పంపనుంది. ఇది మంగళవారం చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలో పరిభ్రమించి విక్రమ్ ల్యాండర్‌ను ఫోటోలు తీయనుంది. 
 
ఇదిలావుంటే, హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌పిట్‌ సోమవారం అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాలో సందడి చేశారు. పిట్‌ నటించిన యాడ్‌ ఆస్టా చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. దీని ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా, బ్రాడ్‌పిట్ నాసాలో సందడి చేశారు. 
 
ఈ సందర్భంగా ఇంటర్నెషనల్‌ స్పేస్‌ స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌)లో ఉన్న ఆస్ట్రోనాట్‌ నిక్‌ హెగ్యూకు పిట్ వీడియో కాల్‌ చేసి సంభాషించారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన వీరి సంభాషణలో పలు ఆసక్తికర అంశాల గురించి చర్చించారు. 
 
వీరిద్దరి సంభాషణల్లో బ్రాడ్‌ పిట్‌ 'భారత్‌ చంద్రుడి మీద ప్రయోగాల కోసం ఉద్దేశించిన విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని కనిపెట్టారా'? అని నిక్‌ని అడిగాడు. అందుకు అతడు దురదృష్టవశాత్తు ఇంకా లేదు అని బదులిచ్చాడు. 
 
దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ వీడియో సంభాషణను నాసా టీవీలో ప్రసారం చేశారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఆఖరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. విక్రమ్‌ ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ పునరుద్ధరణ కోసం ప్రస్తుతం ఇస్రో, నాసాతో కలిసి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.