శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (16:55 IST)

ఆందోళనగా బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం?.. ఆసుపత్రికి తరలింపు

బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్ ఆరోగ్యం ఆందోళనకరంగా వున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే అధికార వర్గాలు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నాయి.

కరోనా వైరస్ సోకడంతో బోరిస్​ జాన్సన్ గత పదిరోజులుగా స్వీయ నిర్బంధంలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అధికారులు బోరిస్‌ జాన్సన్‌ను ఆదివారం ఆసుపత్రికి తరలించారు.

ప్రధానిలో ఇప్పటికీ వైరస్‌ లక్షణాలున్నాయని, అందుకే ఆసుపత్రికి తీసుకెళ్లామని ఓ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆయన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 
 
మంచి రోజులు వస్తాయి: బ్రిటన్‌ రాణి
బ్రిటన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 జాతిని ఉద్దేశించి మాట్లాడారు. విండ్సర్‌ క్యాసిల్‌లో చిత్రీకరించిన వీడియోను ఆమె విడుదల చేశారు. "మంచి రోజులు వస్తాయి. మనం మన స్నేహితులు, కుటుంబసభ్యులతో కలుసుకునే రోజులు. మనం మళ్లీ కలుసుకుంటాము.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నేను మొదటిసారి వీడియో తీసుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. 1940లో మా అక్క ఆ వీడియోను తీసింది. అప్పుడు మేము చిన్న పిల్లలం. యుద్ధ సమయంలో ఇళ్లకు దూరమై బాధపడుతున్న పిల్లలను ఉద్ధేశించి ఆ వీడియోలో మాట్లాడాను. ఈ రోజు చాలామంది తమ ప్రియమైన వారికి దూరమై మరోసారి బాధపడుతున్నారు.

కరోనా వైరస్‌పై పోరాటంలో మనం కచ్చితంగా విజయం సాధిస్తాం. ఈసారి ప్రపంచ దేశాలతో కలిసి మనం పోరాడుతున్నాం. అత్యాధునికమైన సైన్స్‌ మనకు అండగా ఉంది. మన స్వభావసిద్ధమైన కోలుకునే శక్తితో మనం కచ్చితంగా విజయం సాధిస్తాం. ఆ విజయం మనలోని ప్రతీ ఒక్కరికి చెందుతుంది" అని బ్రిటన్ రాణి ప్రజలకు ధైర్యం నూరిపోశారు.