1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: మంగళవారం, 16 మార్చి 2021 (17:41 IST)

ఓటు వేయాలని సీఎం జగన్ అడిగిందే లేదు, కానీ అన్నీ వైసిపికే, ఎలాగబ్బా?

పురపోరులో వైసిపి రాజకీయ చరిత్ర సృష్టించింది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకుని ప్రతిపక్షానికి అందనంత ఎత్తులో నిలిచింది వైసిపి. అసలు ఇంతటి విజయానికి ముఖ్యమంత్రి వ్యూహమేంటి.. ఒక్కసారి కూడా తెరమీదకు రాకుండా ఈ స్థాయిలో విజయాన్ని ఎలా సాధించారు.
 
పురపోరులో వైసిపి హవా. ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోయిన ప్రత్యర్థులు. కనీసం గట్టి సపోర్ట్ ను కూడా ప్రతిపక్షాలు ఇవ్వలేదన్నది విశ్లేషకుల భావన. 73 మున్సిపాలిటీలు, 10కార్పొరేషన్లను గెలుచుకుని ప్రతిపక్షాలను మట్టి కరిపించింది. అయితే ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ పురపోరులో ఒక్కసారి కూడా తెరమీదకు రాలేదు.
 
తెరవెనుక నుంచే అంతా నడిపించిన జగన్ ప్రత్యర్థులకు అర్థం కాని స్టాటజీ తనదని నిరూపించారు. ఒకవైపు ఈ ఎన్నికల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రచారాన్ని హోరెత్తిస్తూ వాడివేడి విమర్సలతో ప్రభుత్వంపై విరుచుకుపడితే సిఎం జగన్ మాత్రం ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు.
 
తమకు ఓటు వెయ్యాలంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి అభ్యర్థించలేదు. అయినా వైసిపిపై అంతులేని విశ్వాసాన్ని కనబరిచారు ప్రజలు. అఖండ విజయాన్ని కట్టబెట్టారు. సిఎం టూర్లు లేవు.. హామీలు లేవు. అయితే ఈ స్థాయిలో వైసిపి సాధించిన విజయానికి కారణమేంటి.
 
ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే వైసిపి విజయానికి కారణమయ్యిందంటున్నారు ఆ పార్టీ నేతలు. తెర వెనుకే ఉంటూ పార్టీలోని సీనియర్ నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళారు జగన్. లోకల్ లీడర్స్‌ను మొబిలైజ్ చేసి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ప్రత్యర్థులు ఎంత విస్తృత ప్రచారం చేసినా జగన్ వ్యూహం ముందు బోల్తా పడక తప్పలేదంటున్నారు విశ్లేషకులు.