గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (12:04 IST)

పోరాడే ఓపిక లేదు.. క్షమించండి.. వీజీ సిద్ధార్థ లేఖ

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన సోమవారం సాయంత్రం మంగుళూరులోని నేత్రావతి నది వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. 
 
అయితే, ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడేముందు... చివరగా కేఫ్ కాఫీ డే సీఎఫ్‌వోతో మాట్లాడినట్టు ఫోన్ కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. అలాగే, తన ఉద్యోగులకు ఆయన ఓ లేఖ కూడా రాశారు. ఈ లేఖలో పలు విషయాలు పేర్కొన్నట్టు సమాచారం. 
 
తన కృషితో 30 వేల మందికి ప్రత్యక్షంగా, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధిని కల్పించానని, ఎంత ప్రయత్నించినా సంస్థను లాభాల్లోకి నడపలేక పోయానని వాపోయారు. ఇక ఇక పోరాడే ఓపిక లేదని, అందుకే అన్నీ వదిలేస్తున్నానని, తనను క్షమించాలని అన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఈక్విటీలోని భాగస్వాముల నుంచి తనపై తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. 
 
కొత్త యాజమాన్యానికి ఉద్యోగులంతా సహకరించాలని, వ్యాపారాన్ని కొనసాగించాలని సూచించారు. ఆదాయపు పన్ను మాజీ డైరెక్టర్ జనరల్ తనను ఎంతో వేధించారని ఆరోపించారు. జరిగిన తప్పులన్నింటికీ తనదే బాధ్యతని, తాను జరిపిన డీల్స్ గురించి మేనేజ్‌మెంట్‌‌కు, ఆడిటర్లకు తెలియదన్నారు. తాను ఎవర్నీ మోసం చేయాలనుకోలేదని, చివరకు తాను విఫలమైన వ్యాపారవేత్తగా మిగిలానని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. 
 
మరోవైపు సిద్ధార్థ కోసం నేత్రావతి నదిలో వందలాది మంది గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఇంకోవైపు, ఎస్ఎం కృష్ణ ఇంటికి ముఖ్యమంత్రి యడియూరప్పతో పాటు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వెళ్లి పరామర్శించారు.