1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : ఆదివారం, 16 మే 2021 (18:41 IST)

బాత్‌రూమ్‌లోనే ఐసోలేషన్, కరోనా రోగి వింత నిర్ణయం, ఎంత చెప్పినా వినిపించుకోకుండా...

కరోనా వేళ పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, కార్పోరేట్ వైద్యం చేయించుకునే స్తోమత లేక నలిగిపోతున్నారు. కనీసం హోం ఐసోలేషన్‌లో ఉందామన్నా... ఇంట్లో సెపరేట్ గదులు లేక సతమతమవుతున్నారు. దీంతో ఇంటికి దూరంగా పంట పొలాల వద్ద గుడిసెలు వేసుకుని ఉంటున్నవారు లేకపోలేదు. అయితే ఆ అవకాశం కూడా లేనివాళ్ల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. అయితే హోం ఐసోలేషన్‌లో ఉండే అవకాశం ఉన్నా... వికారాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి వింత నిర్ణయం తీసుకున్నాడు.
 
బాత్‌రూమ్‌లో ఉంటున్న కరోనా రోగి...
వికారాబాద్‌ జిల్లా ధారూరు మండల పరిధిలోని మైలారం గ్రామంలో అశోక్(30) అనే వ్యక్తి భార్యా,పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల అతనికి కరోనా సోకింది. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే అశోక్ మాత్రం... ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులకు ఎక్కడ వైరస్ సంక్రమిస్తుందోనని ఆందోళన చెందాడు. దీంతో ఇంటికి కాస్త దూరంలో నిర్మించుకున్న బాత్‌రూమ్‌నే తన ఐసోలేషన్ గదిగా చేసుకున్నాడు. అక్కడే తింటున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు.
 
రెండు ఇళ్లు ఉన్నా బాత్‌రూమ్‌లోనే...
ఇదే విషయాన్ని అశోక్ సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన పరిస్థితి గురించి అందులో వివరించాడు. ఆ వీడియో జిల్లా వైద్యాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. స్థానిక ఎంపీడీవో ద్వారా వివరాలు సేకరించి అనంతగిరి గుట్టలోని ఐసోలేషన్ కేంద్రానికి అతన్ని తరలించారు. మైలారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఈ ఘటనపై మాట్లాడుతూ... కరోనా బాధితుడు అశోక్‌కి రెండు ఇళ్లు ఉన్నాయని చెప్పారు. అందులో ఒక ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండమని చెప్పామన్నారు. కానీ అశోక్‌కి ఎంత చెప్పినా వినిపించుకోలేదని... బాత్‌రూమ్‌లో ఉంటున్నాడని చెప్పారు.
లేనివాళ్ల పరిస్థితి ఇలా...
హోమ్ ఐసోలేషన్‌లో ఉండేందుకు అవకాశం ఉన్నా అశోక్ బాత్‌రూమ్‌లో ఉండగా... ఇంట్లో ఒక్కటే గది ఉండటంతో చెట్టుపై మంచె ఏర్పాటు చేసుకుని, దాన్నే ఐసోలేషన్‌గా మార్చుకున్నాడు ఓ యువకుడు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్‌ శివ అనే బీటెక్ స్టూడెంట్ ఇటీవల కరోనా బారినపడ్డాడు.

లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చిన అతను హమాలీ పనులకు వెళ్తున్నాడు. ఇటీవల కరోనా సోకడం... ఇంట్లో ఒకే గది ఉండటంతో ఎక్కడికెళ్లాలో తెలియలేదు. దీంతో ఇంటి ఆవరణలోనే మంచె ఏర్పాటు చేసుకుని దాన్నే ఐసోలేషన్‌గా మార్చుకున్నాడు. కుటుంబ సభ్యులు అక్కడికే భోజనం తీసుకొచ్చి అందిస్తున్నారు. అక్కడే తింటూ, నిద్రపోతూ, సెల్‌ఫోన్‌లో వీడియోలు చూస్తూ గడుపుతున్నాడు.