మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (19:13 IST)

నిన్న (పాకిస్థానీలకి) క్విట్ ఇండియా... నేడు (కాశ్మీరీలకి) సహాయనిరాకరణ

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అసహనంతో కూడిన ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇందులో భాగంగానే నిన్న ఒక జిల్లా కలెక్టర్ క్విట్ ఇండియా అన్నాడంటే... అది కేవలం పాకిస్థానీలని మాత్రమే... కానీ ఇప్పుడు సీన్ మరింత పూర్తిగా మారిపోయి పాకిస్తాన్ వేర్పాటువాదులకి మద్దతిస్తున్న కాశ్మీరీలకు కూడా సహాయ నిరాకరణ మొదలెట్టేశారు.. అయితే ఇది ఏ అధికారి స్థాయిలోదో కాదు.. సామాన్య ప్రజానీకం మొదలుపెట్టిన ఒక చిన్నపాటి ఉద్యమం. 
 
వివరాలలోకి వెళ్తే... ఇటీవలే మేఘాలయ గవర్నర్ తథాగత్ రాయ్ కాశ్మీరీ వస్తువులను బహిష్కరించాలనీ, ప్రజలెవరూ కాశ్మీర్‌కి వెళ్లొద్దని వ్యాఖ్యానించి వివాదం సృష్టించారు. ఈ క్రమంలో ఆగ్రాకి చెందిన కొన్ని హోటళ్లలో కాశ్మీరీలకు అనుమతి లేదంటూ ఏకంగా నోటీసులు పెట్టేశారు.
 
ఆగ్రాలోని కిషన్ టూరిస్ట్ లాడ్జ్‌లో ఈ రకమైన నోటీస్ పెట్టారు. సదరు లాడ్జ్ మేనేజర్ రజబ్ అలీ మాట్లాడుతూ.. '46 మంది జవాన్లు, అధికారులు ఉగ్రదాడుల్లో మృతి చెందారు. కానీ కాశ్మీర్‌లో ఉండే కొందరు స్థానికులు ఉగ్రవాదులకు మద్దతునిస్తున్నారు. కాబట్టి వాళ్లని మా హోటల్‌లోకి అనుమతించము' అని తెలిపారు. 
 
అంతేకాకుండా.. హోటల్ రిజ్‌లో కూడా కాశ్మీరీలకు అనుమతి లేదంటూ నోటీసులు పెట్టారు. ఈ హోటల్ మేనేజర్ రోహిత్ మాట్లాడుతూ.. 'ఒక భారతీయుడిగా మన సైనికులను శతృవులుగా చూస్తున్న కాశ్మీరీలకు మేము మద్దతు ఇవ్వం. వాళ్లు మన సైనికులపై రాళ్లు రువ్వటం వంటి దుశ్చర్యలు ఆపకపోతే.. వాళ్లని మేం మా హోటళ్లలోకి అనుమతించం' అని అన్నారు.
 
కానీ ఆగ్రా హోటల్ సంఘం అధ్యక్షుడు రమేశ్ వాధ్వా మాట్లాడుతూ.. 'కాశ్మీరీలపై ఇటువంటి నిరసన తెలపడాన్ని మేం సమర్థించడం లేదు. వాళ్లు కూడా భారతీయులే. ప్రతి కాశ్మీర్ పర్యాటకులు ఏ హోటల్‌లో అయినా ఉండవచ్చు' అని తెలిపారు. 
 
అయితే... ఈ హోటల్ యాజమాన్యాలు చేసిన ఈ పనిని పలువురు నెటిజన్లు కూడా కొందరు చేస్తున్న పనికి ఒక ప్రాంతంలోని అందరినీ బాధించడం మంచిది కాదంటూ విమర్శిస్తూండటం ఇక్కడ కొసమెరుపు.