శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (10:48 IST)

మరో గుజరాత్ దొంగ : నిన్న నీరవ్... నేడు నితిన్... రూ.5383 కోట్లతో కుచ్చుటోపీ

గుజరాత్ రాష్ట్రానికి చెందిన మరో బడా వ్యాపారి, స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర దేశం విడిచి చెక్కేశాడు. ఈయన దేశీయ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.5383 కోట్ల మేరకు రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా ప

మరో గుజరాత్ దొంగ దేశం విడిచి పారిపోయాడు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దేశంలోని బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విషయం తెల్సిందే. ఇపుడు అదే గుజరాత్ రాష్ట్రానికి చెందిన మరో బడా వ్యాపారి, స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర దేశం విడిచి చెక్కేశాడు. ఈయన దేశీయ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.5383 కోట్ల మేరకు రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా పారిపోయాడు.
 
ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న నితిన్ నైజీరియాకు వెళ్లిపోయాడు. ఇప్పటికే సీబీఐతో పాటు ఈడీ కేసులు ఉన్నప్పటికీ నితిన్ భారత్ నుంచి చల్లగా జారుకోవడంపట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. 
 
ఈ నేపథ్యంలో నితిన్‌తోపాటు కంపెనీలో భాగస్వాములుగా ఉన్న అతని కుటుంబ సభ్యులపై సీబీఐ, ఈడీలు కేసును నమోదుచేశాయి. దీంతో విచారణను తప్పించుకునేందుకు నితిన్ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. తొలుత నితిన్‌ను దుబాయ్‌లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదనీ, ఇప్పటికే నితిన్ కుటుంబం నైజీరియాకు వెళ్లిపోయిందని సీబీఐ అధికారులు తెలిపారు. 
 
బ్యాంకుల నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న నితిన్ ఈ మొత్తాన్ని 300 డొల్ల కంపెనీల ద్వారా దేశ విదేశాల్లోని అకౌంట్లలోకి అక్రమంగా మళ్లించాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే రూ.4,700 కోట్ల విలువైన స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తులను జప్తుచేసింది. కాగా, ప్రస్తుతం నైజీరియాలో తలదాచుకున్నారని భావిస్తున్న నితిన్ కుటుంబాన్ని భారత్‌కు రప్పించేందుకు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులను జారీచేసే అవకాశం ఉంది.