గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (12:44 IST)

తేళ్ళతో హోలీ పండుగ జరుపుకోవడమే ఆ గ్రామం స్పెషల్.. ఎక్కడ?

భూమిమీదవున్న విషపు పురుగుల్లో తేళ్లు ఒకటి. వీటిని చూస్తే చాలా మంది భయంతో వణికిపోతారు. తేళ్లు కుట్టడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి తేళ్ళతో హోలీ పండుగ జరుపుకునే గ్రామం మన దేశంలో ఉందంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా జిల్లా పరిధిలోని సోంతనా అనే గ్రామ వాసులు తేళ్ళతో ఈ హోలీ పండుగను జరుపుకున్నారు. హోలీ రంగులకు బదులుగా తేళ్లతో ఆడారు. తేళ్ళతో ఆడుతున్నా, ఒకరిపై ఒకరు విసురుఉన్నా గ్రామస్తులను తేళ్లు ఏమీ అనకపోవడం విశేషం. ఈ శాస్త్రీయ యుగంలో ఈ దృశ్యం రహస్యం వలె కనిపిస్తుంది.
 
హోలీ వేదిక డ్రమ్ మోగగానే వందలాది తేళ్లు వారి జేబుల నుంచి బయటకు తీస్తారు. అవి ఒక్కసారిగా రావడం చూస్తే హోలీ రోజున వారిని పలకరించడానికి బయటకు వచ్చినట్లుగా అనిపిస్తుంది. పిల్లలు తేళ్లను పట్టుకుని ఆడుకుంటారు. ఒకరిపై ఒకరు విసురుకుంటారు. వాటిని నెత్తిపైన పెట్టుకుని పరిగెత్తుతుంటారు. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతుండటం గమనార్హం. 
 
సోంతనా గ్రామం వెలుపల భైన్సన్ అనే పురాతన మట్టిదిబ్బ ఉంది. ప్రజలు సాధారణంగా తొలగించే ఈ మట్టిదిబ్బపై వేలాది ఇటుక, రాళ్ల ముక్కలు పడి ఉన్నాయి. మామూలు రోజుల్లో ఇక్కడ ఏవీ కనిపించవు. అయితే, హోలీ పూర్ణిమ రెండో రోజు సాయంత్రం గ్రామ పెద్దలు, పిల్లలు మట్టిదిబ్బపై గుమిగూడి పాటలు పాడటం ప్రారంభింగానే ఇటుకలు, రాళ్ళ మధ్య నుంచి వేలాది విషపు తేళ్లు బయటకు వస్తాయి. వాటిని తీసుకుని అరచేతిలో ఉంచుకొని శరీరాలపై దొర్లించుకుంటారు.
 
మట్టిదిబ్బ నుంచి బయలుదేరే ముందు గ్రామ పెద్దల ఆశీర్వాదం తీసుకొని తేళ్లను అక్కడే వదిలేస్తారు. మరుసటి రోజు చూస్తే మట్టిదిబ్బ మీద ఒక్క తేలు కూడా కనిపించదని గ్రామస్తుడు కృష్ణ ప్రతాప్‌ సింగ్‌ బదౌరియా చెప్పారు. ఈ సంప్రదాయం వందల ఏండ్లుగా కొనసాగుతున్నదని పూర్వీకుల ద్వారా తెలుసుకున్నామని, ఇప్పటికీ ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.