శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (16:39 IST)

భారత్‌లో 14వేల మార్కు దాటిన కరోనా.. ఏపీలో 796, తెలంగాణలో 985 కేసులు

భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా ఏడో రోజు కరోనా కేసుల మార్క్ 14 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 18,552 కేసులు, 384 మరణాలు సంభవించాయి. దీనితో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటేసింది.
 
దేశవ్యాప్తంగా 5,08,953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,97,387 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,685 మంది కరోనాతో మరణించారు. ఇక 2,95,881 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోని 5 రాష్ట్రాలలో 70 శాతం పాజిటివ్ కేసులు, 82 శాతం కోవిడ్ మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
మహారాష్ట్రలో లక్షా 52 వేల కేసులు, ఢిల్లీలో 77 వేలు, తమిళనాడులో 74 వేలు, గుజరాత్‌లో 30 వేలు, ఉత్తరప్రదేశ్‌లో 20 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 3.5 లక్షల కరోనా కేసులు, 12,600లకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి.
 
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 24,458 మంది నమూనాలు పరీక్షించగా 796 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.  పొరుగు దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 12,285 కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా 985 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,349కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 4,766 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 7,436 ఉన్నాయి. నేడు కరోనాతో ఏడుగురు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 237గా నమోదైంది.