కొత్తగా తెరగేంట్రం చేసే కథానాయకులు వినాయక్తో చేయాలని అనుకుంటారు. అలా పలువురు హీరోలు ఆయన దర్శకత్వంలో చేసి మాస్ హీరోలుగా మారినవారున్నారు. ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా ఆయన చేతిలో హీరోగా మలచబడ్డాడు. మరో హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పేరు 'అఖిల్'. ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలకు ఈ విధంగా సమాధానమిచ్చారు.
విడుదల వాయిదాకు రీష్యూట్ అని వార్తలు వచ్చాయి?
రీష్యూట్ అనేది జరగలేదు. సినిమా క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మొత్తం గ్రాఫిక్స్లో ఉంటుంది. సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ ఫైట్ మాకు సంతృప్తికరంగా అనిపించలేదు. ఆ కారణం చేత విడుదల వాయిదా వేయడం జరిగింది. చివరి నిమిషంలో నా స్నేహితుడికి చెందిన డిక్యూ కంపెనీ గ్రాఫిక్స్ బాధ్యతను తీసుకుంది. తక్కువ సమయంలో మంచి గ్రాఫిక్స్ చేశారు. ఇప్పుడు చాలా హ్యాపీ.
మీ తరహా చిత్రంగా వుంటుందా?
మంచి కామెడీ చిత్రం. ఇదేదో సోషియో ఫాంటసీ చిత్రం అంటూ బయట ప్రచారం జరుగుతుంది. ఫైట్స్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు.. అన్నీ ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రం. ప్రేక్షకులకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయి.
ఆఫ్రికాలో చేయడానికి కారణం?
కథ మేరకు అక్కడయితే బాగుంటుందనే. ఆఫ్రికా ఖండంలో భూమధ్య రేఖ వద్ద జరిగే కథ. సూర్యుడిని అక్కడ 'జువా' అని పిలుస్తారు. దానికి సంబంధించిన కథ. సామాజిక అంశాలు ఉంటాయి.
'అఖిల్'ను ఎలా చూపించబోతున్నారు?
'మనం' సినిమాలో అఖిల్ను చూడగానే నాకు బాగా నచ్చాడు. అప్పుడే తనతో సినిమా చేయాలనుకున్నాను. ఒక స్టార్ హీరో కొడుకుని ఇంట్రడ్యూస్ చేయడమనే విషయంలో చాలా టెన్షన్ పడేవాడిని. కథ కోసం, క్వాలిటీ కోసం కష్టపడ్డాం. నాగార్జున గారు ఒక ఫంక్షన్లో నా కొడుకుని వినాయక్కు ఇచ్చాను అని చెప్పారు. అప్పుడు నాపై బాధ్యత పెరిగిందనుకున్నాను. కమర్షియల్ మాస్ హీరోలా చూపిస్తున్నా.
ప్రేక్షకులపై నాగార్జున కొంత ప్రభావం చూపారు. ఆయన దృష్టిలో నుంచి 'అఖిల్'ను చూస్తారు. కానీ, అఖిల్ కొత్తగా, విభిన్నంగా కనిపిస్తాడు. డాన్స్, ఫైట్స్, గట్రా ఎంత బాగా చేశాడు అని ఆశ్చర్యపోతారు. కామెడీ చేయడం చాలా కష్టం. బ్రహ్మానందం లాంటి గొప్ప నటుడి పక్కన మంచి టైమింగ్తో డైలాగులు చెప్పాడు. పక్కా కమర్షియల్ హీరో. రాబోయే కాలంలో గొప్ప హీరోగా ఎదుగుతాడు. ఈ సినిమాతో వినాయక్ యూత్ఫుల్ సినిమా తీశాడని ప్రేక్షకులు అంటారు.
వాయిదాతో ప్రతికూల ప్రభావం పడుతుందా?
ప్రతికూల ప్రభావం ఏమీ వుండదు. విడుదల వాయిదా పడిన తర్వాత అక్కినేని అభిమానులు నిరాశ చెందిన మాట వాస్తవమే. నాగార్జున, నేను, సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి పరిస్థితి వివరించిన తర్వాత వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు, శాంతించారు. నైజాంలో 370 నుంచి 400ల ధియేటర్లలో చిత్రం విడుదలవుతుంది. విజయదశమికి మాకు అన్ని థియేటర్లు లభించేవి కాదు.
నాగార్జున గారికి గ్రాఫిక్స్ నచ్చలేదా?
సినిమా అంతా బ్రహ్మాండంగా తీశారు. పతాక సన్నివేశాల్లో ఎందుకు రాజీ పడాలి. అక్కడ గ్రాఫిక్స్ బాగుంటే మంచిదని సూచించారు. మా భావన కూడా అదే. సమిష్టి నిర్ణయంతో వాయిదా వేయడం జరిగింది. బయట మాట్లాడుతున్నంత పెద్ద సమస్యలు మామధ్య లేవు.
సయేషా సైగల్ ఎలా నటించింది?
ఆ అమ్మాయి మంచి నటి. డాన్స్ బాగా చేస్తుంది. బాగా నటిస్తుంది. సుధాకర్ రెడ్డి మిత్రుడి సలహాతో బొంబాయి వెళ్లి తనను చూశా. చూసిన వెంటనే ఎంపిక చేశా. దిలీప్ కుమార్ గారి మనవరాలు. భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది.
మొదటి చిత్రానికి ఇంత హైప్ వచ్చింది. రెండో చిత్రానికి 'అఖిల్'పై అంచనాలు మరింత పెరుగుతాయి కదా!
పెరుగుతాయి. ఇంకా పెరగాలి. అలా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అఖిల్ మెచ్యూర్డ్ హీరో. వెనుక నాగార్జున ఉన్నారు. మంచి ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తాడు
తదుపరి చిత్రాలు?
ఓ నెలరోజులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. ఓ ఐదారు చిత్రాలకు కష్టపడినంత ఈ చిత్రానికి శ్రమించాం. ఆ తర్వాత కొత్త చిత్రం కబుర్లు చెప్తా.
చిరంజీవితో 'కత్తి' పట్టిస్తున్నారా? కొత్త కథతో చేస్తున్నారు?
చిరంజేవి గారితో సరదాగా మాట్లాడడానికి కలుస్తుంటాను. అంతేకాని సినిమా గురించి కాదు. ఆయనతో సినిమా చేస్తానా..? లేదా..? అనేది త్వరలోనే తెలియజేస్తాను అంటూ ముగించారు.