శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (13:48 IST)

సుందర్ పిచాయ్‌కు స్టాక్ ప్యాకేజీ.. వార్షిక వేతనం రూ.1721 కోట్లు!

గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో) సుందర్‌ పిచాయ్‌ భారీ వేతనాన్ని అందుకోనున్నారు. ఆయన వేతనం ఎంతో తెలిస్తే ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడతారు. ముఖ్యంగా, తన పనితీరు లక్ష్యాలను చేరుకుంటే వచ్చే మూడేళ్లలో స్టాక్‌ అవార్డు రూపంలో భారీ మొత్తాన్ని అందుకోనున్నారు. 
 
స్టాక్‌ ప్యాకేజీలో భాగంగా 240 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల(రూ.1,721కోట్లు), 2020లో 2 మిలియన్‌ డాలర్ల (14 కోట్లు)ను వార్షిక వేతనంగా తీసుకోనున్నారు. పనితీరు, ఆధారిత స్టాక్‌ అవార్డులను కంపెనీ తొలిసారి ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగానే పిచాయ్‌ అదనంగా రూ.640 కోట్లను జీతంగా అందుకునే వీలుందని వార్తలు వస్తున్నాయి.
 
నిజానికి గూగుల్ కంపెనీలో 2004లో చేరిన పిచాయ్... అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్‌ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు. గూగుల్‌ సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్‌ పిచాయ్‌ ఇటీవలే ఆల్ఫాబెట్‌ సీఈవోగా నియమితులైన విషయం తెలిసిందే. జనవరి 1 నుంచి సుందర్‌ 2 మిలియన్‌ డాలర్లను వేతనంగా పొందనున్నారని ఆల్ఫాబెట్‌ సెక్యూరిటీస్‌ ఎక్సేంజ్‌ కమిషన్‌కు ఆల్ఫాబెట్‌ తెలిపింది. 
 
గూగుల్‌తో పాటు ఆల్ఫాబెట్‌ సీఈవోగా కూడా బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో పరిహార ప్యాకేజీ కూడా ఇస్తున్నట్లు పేర్కొంది. గూగుల్‌ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ తమ పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆల్ఫాబెట్‌ సీఈవో, అధ్యక్షులుగా ఉన్న వీరిద్దరూ ఇకపై కంపెనీ బోర్డులో సభ్యులుగా మాత్రమే కొనసాగనున్నారు.