1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (14:14 IST)

ఐఎఎఫ్ హెలికాఫ్టర్ ప్రమాదం: గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఇకలేరు

డిసెంబరు 8న తమిళనాడులోని కానూరులో జరిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ గాయాలతో మరణించినట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బుధవారం వెల్లడించింది.

 
కానూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో భారతదేశపు అత్యంత సీనియర్ సైనిక అధికారి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో సహా మరో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.

 
బుధవారం IAF ట్వీట్లో ఇలా పేర్కొంది, “8 డిసెంబర్ 21న హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి ఈ ఉదయం మరణించిన ధైర్యవంతుడు గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మరణించిన విషయాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నాం. IAF హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది."

 
ఆయన మృతి తనను కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. “గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ దేశానికి గర్వకారణం, ఆయన పరాక్రమం, అత్యంత వృత్తి నైపుణ్యంతో సేవ చేశారు. ఆయన మృతి పట్ల నేను తీవ్ర వేదనకు లోనయ్యాను. దేశానికి ఆయన చేసిన గొప్ప సేవ ఎన్నటికీ మరువలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి' అని ట్వీట్‌ చేశారు.
 

ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున శౌర్య చక్రతో సత్కరించబడిన సింగ్, బెంగుళూరులోని ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా కాలిన గాయాల గత వారం రోజులుగా ఆయన ప్రాణాల కోసం పోరాడారు. 

 
39 ఏళ్ల ఆయన రక్షణ కుటుంబానికి చెందినవారు, ఆయన సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తున్నారు. ఆయన తండ్రి కల్నల్ (రిటైర్డ్) కెపి సింగ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌లో పనిచేసారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.