ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో ప్రముఖ యూట్యూబర్, 'బిగ్ బాస్' ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటన కలకలం రేపింది. హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న ఆయన ఇంటిపై ఈ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు దుండగులు ఎల్విష్ యాదవ్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. దాదాపు 25 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు.
కాల్పుల జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ (27) పని నిమిత్తం హర్యానా బయట ఉన్నట్లు తెలిసింది. అయితే, ఆయన కుటుంబ సభ్యులు, ఇంటి కేర్ టేకర్ మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఈ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో ఎల్విష్ కుటుంబం నివాసం ఉంటోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే గురుగ్రామ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
సెక్టార్-56 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఎల్విష్ యాదవ్ కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. దుండగులు ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.