అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...  
                                       
                  
				  				  
				   
                  				  తెలుగు విద్యార్థిపై అమెరికాలో దారుణం జరిగింది. నోట్లో తుపాకీ గురిపెట్టి ఫట్మని పేల్చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థి తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
				  											
																													
									  
	 
	మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పూస సాయికృష్ణ అనే విద్యార్థి అమెరికాలోని లారెన్స్ టెక్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత మిచిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో ఉన్న ఆటోమోటివ్ కంపెనీలో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. 
				  
	 
	ఈనెల మూడో తేదీ రాత్రి 11.30కి సాయికృష్ణ ఒక్కడే కారులో ఇంటికి వెళ్తూ స్థానిక మెక్సికన్ ఫుడ్కోర్టు దగ్గర ఆగారు. అపుడు కొందరు దుండగులు అనూహ్యంగా కారులో జొరబడ్డారు. సాయికృష్ణను తుపాకీతో బెదిరించి కారులో కొన్ని మైళ్ల దూరం తీసుకువెళ్లారు. ఎవరూ లేని నిర్జన ప్రదేశంలో కారు ఆపి నిలువుదోపిడీ చేశారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	బంగారు ఆభరణాలు, సెల్ఫోన్, ఐడీ కార్డులు, క్రెడిట్కార్డులు, డెబిట్ కార్డులు లాక్కున్నారు. ప్యాంటు కూడా విప్పించారు. ఆ తర్వాత సాయికృష్ణ నోట్లో తుపాకి పెట్టి కాల్చారు. కుడి భుజం మీదా కాల్పులు జరిపారు. రక్తమోడుతున్న సాయికృష్ణను నడిరోడ్డు మీద వదిలేసి ఆయన కారులోనే పరారయ్యారు. 
				  																		
											
									  
	 
	ఎముకలు కొరికే చలిలో గంటకు పైగా నడిరోడ్డుపై గాయాలతో పడి ఉన్న సాయికృష్ణను కొందరు మహిళలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చావుబతుకుల మధ్య జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు.