శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (14:05 IST)

కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్టీఆర్ - పీవీ ఘాట్స్‌ను కూల్చివేయాలి? : ఎమ్మెల్యే అక్బరుద్దీన్

తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాసకు ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బహిరంగ సవాల్ విసిరారు. అక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇళ్ళు కూల్చివేయడం కాదనీ, దమ్ముంటే హుస్సేన్ సాగర్‌పై ఉన్న ఎన్టీఆర్, పీవీ నరసింహా రావు ఘాట్స్‌ను కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, తెరాస ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కేటాయించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 
 
అంతేకాకుండా, తాము తలచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేయగలమని ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే చర్చనీయాంశంకాగా, అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పేద ప్రజల ఇళ్లను అక్రమ కట్టడాలు, కబ్జాల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చి వేస్తోందని అక్బర్ మండి పడ్డారు.
 
ప్రభుత్వానికి దమ్ముంటే హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ఘాట్లను కూల్చేయాలని సవాల్ విసిరారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడంలో టీఆర్ఎస్ విఫలమైందని చెప్పారు. ఎంఐఎంతో పొత్తు లేదని కేటీఆర్ అంటున్నారని... తమకు ఎవరి కింద బతకాల్సిన దుస్థితి లేదని అన్నారు. 
 
తాము అడుగేస్తే దుమ్ము లేస్తుందని చెప్పారు. అసెంబ్లీలో తోకను తొక్కి టీఆర్ఎ‌స్‌ను ఎలా నిలబెట్టాలో, ఎలా కూర్చోబెట్టాలో తమకు తెలుసని అన్నారు. తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కనుసన్నల్లోనే ఓల్డ్ సిటీ (పాతబస్తి) నడుస్తుందని చెప్పారు.
 
కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల (జీహెచ్ఎంసీ) పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, తెరాస, ఎంఐఎంల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తెరాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం గమనార్హం.