భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై గృహహింస, క్రూరత్వం, మోసం కేసులను బనాయించారు. ఈ మేరకు తన భర్త పీటర్ హాగ్పై ఆమె ముంబై మహానగరంలోని ఓ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. దీన్ని పరిశీలించిన తర్వాత పీటర్ హాగ్ను కోర్టు నోటీసులు జారీచేయనుంది.
ఆస్ట్రియాలో పీటర్ ఆధీనంలో ఉన్న తన పిల్లలను కలిసేందుకు కూడా అతడు అవకాశం ఇవ్వడం లేదని సెలీనా పిటీషన్లో పేర్కొన్నారు. వారితో వర్చువల్గా మాట్లాడే అవకాశం అయినా కల్పించాలని కోరారు. పీటర్ నుంచి నెలకు రూ.10 లక్షల భరణంతో పాటు రూ.50 కోట్లు పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. దీనిపై డిసెంబరు 12వ తేదీ తర్వాత విచారణ జరగనుంది.
కాగా, గత 2011లో సెలీనా జైట్లీ, పీటర్ హాగ్ను వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. కొన్నేళ్ల తర్వాత ఈ జంటకు మరోసారి కవలలు పుట్టారు. అయితే, అనారోగ్య కారణాలతో వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.