వైఎస్ జగన్ను కించపరుస్తూ ట్విట్టర్లో పోస్ట్, నారా లోకేష్ వార్నింగ్
రాజకీయాలు అనేవి హుందాగా వుండాలని అంటారు. ఐతే కొంతమంది ఆ హుందాను కాలరాసి ఇష్టానుసారంగా దుర్భాషలు మాట్లాడటం, అవమానకరంగా వ్యాఖ్యలు చేయడం వంటివి చేస్తుంటారు. వాస్తవానికి అలాంటివి ఆ నాయకులకు తృప్తినిస్తాయేమో కానీ ప్రజలు వాటిని మెచ్చరు. కనుక సమయం వచ్చినప్పుడు ఓటుతో తమ నిర్ణయాన్ని చెప్పేస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కించపరిచేవిధంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది.
ఆ పోస్ట్ వీడియోలో, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో రోడ్డు పక్కనే బైఠాయించిన వైఎస్ జగన్ తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటూ ఈ ముగ్గురు నాయకులను వెంటబడుతూ ఒంగి ఒంగి బ్రతిమాలుతుంటాడు. ఈ వీడియోపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేస్తుండగా అది కాస్తా మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది.
వెంటనే దానిపై ఆయన స్పందిస్తూ... ఇలాంటి వ్యక్తిగత దూషణలు, అవమానాలు చేస్తూ పెట్టే పోస్టులకు నేను పూర్తి వ్యతిరేకం. తెదేపా కుటుంబం కూడా అలాంటి వాటికి దూరంగా వుండాలి. రాజకీయాలు గౌరవప్రదంగా వుండాలి కానీ వ్యక్తిగత దూషణల దిశగా వుండరాదు. కనుక భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడవద్దని కోరుతున్నానంటూ పేర్కొన్నారు.