శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జనవరి 2021 (15:14 IST)

సీఎం జగన్ చెంపలు వాయించేలా సుప్రీం తీర్పు.. అచ్చెన్నాయుడు

సీఎం జగన్ రెండు చెంపలు వాయించేలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సీఎం అయిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. మూడు రాజధానులు తప్పు అంటే మండలి రద్దు అన్నారు.

ఐఏఎస్, ఐపీఎస్‌లను జేబు సంస్థలుగా మార్చి.. జగన్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో లోపం లేదు.. పాలకుల నడవడికలో లోపం ఉందని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో జగన్ ఆగడాలకు చెక్ పెట్టాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
 
అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై సీఎం జగన్ తీరు పై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించే సీఎం అయితే పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుని అమలు చేసేవారని.. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండేవారు కాదని ఎద్దేవా చేశారు.

న్యాయమూర్తులు మారినా న్యాయం మారదని మరోసారి రుజువైందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగులపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు సీఎం జగన్ భాద్యుడని చెప్పారు. రాజకీయాలతో ఉద్యోగులకు పనేంటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యతిరేక పాలన జరిగితే పరిరక్షణ బాధ్యత గవర్నర్‌ తీసుకోవాలన్నారు.
 
ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా గవర్నర్ మౌనం వహిస్తున్నారని.. ఇప్పటికైనా మౌనం వీడాలని కోరారు. రాజ్యాంగం మంచిదైనా అమలు చేసేవాళ్లు దుష్టులైతే చేదు ఫలితాలే వస్తాయని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు.

జగన్ పాలనలో 20 నెలలుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నరకయాతన అనుభవిస్తున్నారని.. బోధనా రుసుముల కోసం విద్యార్థులు సీఎం ఇంటి వద్ద ఆందోళన చేస్తే అత్యాచారయత్నం కేసు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.