గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (20:27 IST)

సమ్మె విరమిస్తామంటే కుదరదు : తెలంగాణ ఆర్టీసీ ఎండీ

తెలంగాణ రాష్ట్రంలో గత 50 రోజులకుపైగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కార్మిక సంఘాల జేఏసీ ఓ నిర్ణయం తీసుకుంది. సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందించారు. సమ్మె విరమిస్తున్నట్టు జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదని తేల్చి చెప్పారు. సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదన్నారు. ఓవైపు పోరాటం అంటూనే మరోవైపు విధుల్లో చేరతామంటున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులు సమ్మెకు దిగారని, అనాలోచిత సమ్మెతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించారని సునీల్ శర్మ వ్యాఖ్యానించారు.
 
కార్మిక శాఖ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. లేబర్ కోర్టు ఆదేశాలు వచ్చేవరకు సంయమనంతో ఉండాలన్నారు. యూనియన్ల మాట విని కార్మికులు నష్టపోయారని, ఇకపై యూనియన్ల మాట విని మరిన్ని కష్టాలు తెచ్చుకోవద్దని హితవు పలికారు. డిపోల వద్ద శాంతిభద్రతల సమస్యలు సృష్టించవద్దని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.