మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు - టీడీపీ ఖాతాలో రెండు

tdp flag
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపొందగా, తూర్పు - రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. అయితే, పశ్చిమ - రాయలసీమ స్థానంలో మాత్రం అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ హోరాహీరోగా సాగుతోంది. ఈ స్థానం ఫలితం శనివారం సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది. 
 
ఉత్తరాంధ్ర స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిరంజీవి రావుకు అవసరమైన 90 శాతం తొలి ప్రాధాన్యత ఓట్లలో సాధించగా, మిగిలినవి రెండో ప్రాధాన్యత ఓట్లు రావడంతో ఆయన ఘన విజయంసాధించారు. ఈయన విజయానికి 94509 ఓట్లు అవసరం కాగా తొలి ప్రాధాన్యంలో 82958 ఓట్లు, రెండో ప్రాధాన్యంలో 11551 ఓట్లు సాధించారు. ఈ రెండు కలుపుకుని 1,12,686 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో వైకాపా అభ్యర్థి ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయారు. దీంతో వీరిద్దరి మధ్య ఓట్ల శాతంలో భారీ తేడా కనిపించింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి మాధవ్ సహా 34 మంది డిపాజిట్లు కోల్పోయారు.
 
అలాగే, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి శ్రీకాంత్ 1,12,686 ఓట్లు సాధించారు. వైకాపా అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డికి 85423 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైకాపా అభ్యర్థి ఓడిపోయారు. అయితే, ఈ రెండు స్థానాల ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సివుంది.
 
మరోవైపు, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ సాగుతోంది. శనివారం ఉదయానికి  మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో  మొత్తం 11 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తం 2,45,576 ఓట్లు పోలవగా ఇందులో వైసీపీ బలపరిచిన వెన్నపూస రవీంద్రారెడ్డికి 95,969, టీడీపీ బలపరిచిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 94,149 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ గెలుపుకు సరిపడిన ఓట్లు రానందువలన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. తుది ఫలితాలు శనివారం సాయంత్రంలోపు వచ్చే అవకాశం ఉంది.