1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (14:34 IST)

మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : టీడీపీ - జనసేన డిమాండ్

Babu-Modi-Pawan
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రకు విభజన చట్టంలోని హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 16, జనసేన 2 ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం తెల్సిందే. అదేసమయంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ మెజార్టీ రాలేదు. ఆ పార్టీ కేవలం 240 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఆ కూటమి నేతగా నరేంద్ర మోడీ ఎంపికయ్యారు. దీంతో ఆయన మరోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్రంలో కొత్తగా ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్యంకానుంది. దీంతో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే రెండు కేబినెట్ బెర్తులు ఇవ్వాలని కోరినట్టు ఎన్డీటీవీ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. అదేవిధంగా ఈ కూటమిలో మరో కీలక పార్టీ అయిన బీహార్‌కు చెందిన జేడీయు కూడా కీలక మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తుంది. వీటిలో రైల్వే, వ్యవసాయ మంత్రిత్వ శాఖలను కోరుతుందని, భారతీయ జనతా పార్టీ మాత్రం ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోనున్నట్టు తెలుస్తుంది. దీంతో కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు అంశం ఇపుడు అమితాసక్తిగా మారింది.