శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 జులై 2021 (08:23 IST)

మరో అల్పపీడనం : గోదారమ్మ ఉగ్రరూపం - 2వ హెచ్చరిక జారీ

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తాజా నివేదిక విడుదల చేసింది. ఈ నెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
దీని ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకట్రెండు చోట్లు మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వివరించింది. తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఆగస్టు 3 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది.
 
ఇదిలావుంటే, గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరి నది భీకరంగా ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తాజాగా ఇక్కడ గోదావరి నీటి మట్టం 48.30 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
 
జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పందిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సాయం అవసరమైన వారు 08744-241950, 08743-232444 నెంబర్లకు కాల్ చేయాలని, తమ పరిస్థితిని వివరిస్తూ ఫొటోలు పంపేవారు 93929 19743 నెంబరుకు వాట్సాప్ చేయాలని సూచించారు.
 
కాగా, పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశముందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం క్షేత్రంలోని పడమర మెట్లకు వద్ద వరద నీరు చేరింది. అన్నదాన సత్రం, పడమర మెట్ల వద్ద ఉన్న దుకాణాలు నీట మునిగాయి.