నేడు ఢిల్లీలో ఏపీ భవిష్యత్ను మార్చే కీలక ఒప్పందం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్, ఆర్థిక స్వరూపాన్నే మార్చే దిశగా ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదరనుంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందం మేరకు టెక్ దిగ్గజం గూగుల్ 10 బిలియన్ డాలర్లు (రూ.88628 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఈ భారీ వ్యయంతో రాష్ట్రంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు దేశంలోనే తొలి గూగుల్ ఏవీ హబ్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన అవగాహనం ఒప్పందంపై మంగళవారం ఢిల్లీలో సంతకాలు జరుగనున్నాయి.
ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్లో ఉదయం 10 గంటలకు ఈ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు, గూగుల్ అనుబంధ సంస్థ 'రైడెన్' ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్ఎఐ) ఇదే అతిపెద్దదిగా నిలవనుండటం విశేషం.
ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ గతేడాది అక్టోబరు నెలలో అమెరికా పర్యటనలో బీజం వేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ జరిపిన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఆవిష్కరణలలో దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గూగుల్ రాబోయే ఐదేళ్లలో (2026-2030 మధ్య) ఈ పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది.
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరం ఏఐ సిటీగా మారనుంది. గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుతో టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ గ్లోబల్ హబ్గా ఎదగనుంది. ప్రభుత్వం అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు వల్ల 2028-2032 మధ్య కాలంలో ఏటా రాష్ట్ర జీఎస్డీపీకి రూ.10,518 కోట్లు చేకూరడంతో పాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,88,220 ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన సింగిల్ విండో క్లియరెన్స్, మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధన వనరులను వేగంగా సమకూర్చేందుకు ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు, ఐటీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.