గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (17:55 IST)

లక్ష్మీపార్వతికి షాకిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు సర్కారు...

lakshmi parvathi
గత వైకాపా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడెమీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన నందమూరి లక్ష్మీపార్వతికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. జగన్ సర్కారు ఆమెకు ఇచ్చిన గౌరవ ఆచార్యుల హోదాను తొలగించింది.
 
గత వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ అనుబంధ నాయకురాలిగా ఆమె చెలామణి అయ్యారు. ముఖ్యంగా, చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై తరచూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఫలితంగా నాటి సీఎం జగన్ ఆమెకు అన్ని రకాలైన మేళ్లు చేశారు. ఇందులోభాగంగానే తెలుగు అకాడెమీ చైర్ పర్సన్‌గా నియమించడంతో పాటు గౌరవ ఆచార్యులు హోదా కల్పించారు. 
 
ఈ క్రమంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం లక్ష్మీపార్వతి విషయంలో కీలక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఆమెకు కేటాయించిన 'గౌరవ ఆచార్యురాలు' హోదాను ఉపసంహరించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎన్.కిశోర్ బాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకూ లక్ష్మీపార్వతికి యూనివర్శిటీ నుండి వేతనం చెల్లించలేదని తెలియజేశారు. 
 
గతంలో ఆమె తెలుగు అకాడమీ చైర్ పర్సన్ బాధ్యతలు చేపట్టిన సమయంలో యూనివర్శిటీ పరిశోధకులకు మార్గదర్శకం (గైడ్) అందించే బాధ్యత ఇచ్చారు. అయితే తాజాగా ఈ విధుల నుండి కూడా ఆమెను తప్పించినట్లు వెల్లడించారు. ఆమె వద్ద మార్గదర్శకం కోసం చేరిన రీసెర్చ్ స్కాలర్స్‌ను తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్‌కు మార్పు చేయాలని ఆదేశించామని యూనివర్శిటీ రిజిస్ట్రార్ కిశోర్ బాబు వెల్లడించారు.