1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (11:45 IST)

దావోస్ వేదికగా ఏపీకి రూ.1.25 లక్షల పెట్టుబడులకు ఎంవోయులు

ys jagan - adani
దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక మండలి సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ష్ర ప్రభుత్వ బృందానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించారు. ఇందులో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయన తన వంతు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, అదానీ, గ్రీన్ కో, అరబిందో సంస్థలతో రూ.1.25 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులకు సంబంధించిన ఆయా కంపెనీలు, ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులోభాగంగా, గ్రీన్ ఎనర్జీ సెజ్, హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. 
 
కాగా, దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో చక్కటి ఫలితాలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి.. లక్షా 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. 
 
పంప్డ్‌ స్టోరేజీ వంటి వినూత్న విధానాలతో 27 వేల 700 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీలో పెట్టుబడులకు... ఏపీని వేదికగా చేసుకుందని ప్రభుత్వం పేర్కొంది. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ సీఈవో కితాబిచ్చారని చెప్పింది.
 
మచిలీపట్నంలో ఒక సెజ్​ను తీసుకురానుండటం... దావోస్‌ ఫలితాల్లో ఒకటని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుందని వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు అత్యాధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈ జోన్‌ను అభివృద్ధి చేస్తారని తెలిపింది.