గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం చంద్రబాబు కుట్రే : మంత్రి కొడాలి నాని

రామతీర్థం దేవస్థానంలో విగ్రహాలం ధ్వంసంపై ఏపీ మంత్రులంతా మూకుమ్మడి దాడి ప్రారంభించారు. ఈ దాడుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది చంద్రబాబే. చంద్రబాబుతో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయి. పదవుల కోసం గుళ్ళు, మసీదులు, చర్చిలు, తిరిగే చంద్రబాబు దేవుళ్ల గురించి మాట్లాడడం ఆశ్చర్యం. 
 
దేవుడులాంటి ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే విజయనగరం జిల్లా రామతీర్థంలో చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తారు. రాజకీయాల్లో దేవుళ్ళను అడ్డంపెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారు. 
 
అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళను కూల్చి, చెత్త ట్రాక్టర్లలో దేవుళ్ళ విగ్రహాలను డంపింగ్ యార్డ్‌ల్లో పడేసిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు ఆధ్వర్యంలోని అతని అనుచరులు అధీనంలో ఉన్న గుళ్ళు, ఊరికి దూరంగా ఉన్న గుళ్ళలో దాడులు జరుగుతున్నాయి అంటూ కొడాలి నాని ఆరోపణలు గుప్పించారు.
 
అధికారంలో ఉన్నప్పుడు పగలు, లేనప్పుడు రాత్రివేళల్లో దేవాలయాలపై చంద్రబాబు దాడులు చేస్తున్నారు. భగవంతుడంటే నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రామతీర్థం ఘటనపై నీతి, నిజాయితీగా విచారణ చేసి దోషులను పట్టుకోవాలనీ ఆదేశాలు జారీ చేశారు. 
 
విచారణలో చంద్రబాబు దోషిగా ఉన్నా.. లేదా..? అతని తండ్రి ఖర్జూర నాయుడు ఉన్నా, తాత కిస్మిస్ నాయుడు ఉన్నా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవనీ చవట, దద్దమ్మ లోకేష్.. ముఖ్యమంత్రి జగన్‌కు ఛాలెంజ్ విసరడం విడ్డూరం అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.
 
కాగా, ఇదే వ్యవహారంపై బీజేపీ నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా మంత్రి కొడాలి నాని స్పందించారు. ఆదివారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. చంద్రబాబు, టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.