1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (08:31 IST)

బీజేపీ అధికారంలోకి వస్తే సీఎంగా బీసీ నేత : సోము వీర్రాజు

ఆంధ్రప్రేదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమి సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పాటైతే ముఖ్యమంత్రిగా బీసీ నేత ఉంటారని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి తీరతామన్నారు. ఈ పని కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీ అలా చేయగలవా అని సవాల్‌ విసిరారు. 
 
రాష్ట్రం దిశ దశ మార్చాలంటే కుటుంబ పార్టీలే అడ్డంకి అని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌, చంద్రబాబు ప్రస్తుత ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. పోలవరం గురించి మాట్లాడేందుకు ఈ రెండు పార్టీలకు అర్హత లేదన్నారు. 
 
కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కృషి వల్లే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా దుమ్ముగూడేన్ని తెలంగాణకు ఇచ్చినా వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ మాట్లాడలేదని.. ఫలితంగా రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. ‘అచ్చెన్నాయుడు హోం మంత్రి అవుతానంటున్నారు.. చంద్రబాబు ఇంటికా’ అని ఎద్దేవా చేశారు.
 
ఇకపోతే, అమరావతిలో ఉన్న రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉండబోదని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌తో దేశానికి జరిగే మేలు గురించి శని, ఆదివారాల్లో కేంద్ర మంత్రులు దేశవ్యాప్తంగా ప్రజలకు వివరిస్తారని విజయవాడలో చెప్పారు. విదేశాంగ మంత్రి జయశంకర్‌ శనివారం విజయవాడకు వచ్చి బడ్జెట్‌ గురించి తెలియజేస్తారని అన్నారు.