1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 18 జనవరి 2022 (14:56 IST)

గుడివాడలో వందల కోట్ల కేసినో... చేతులకు తాళ్లు కట్టుకునే మంత్రి మాట్లాడరే...

ప్రతి విషయానికీ  స్పందించే ఆ మంత్రి ఎందుకు మిన్నకుండిపోయారోనని  ఏపీ బీజేపీ  అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని గుడివాడ లో  కేసినో వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగు సంస్కృతిని దెబ్బతీసేందుకే వైసీపీ కంకణం కట్టుకుందన్నారు. 
 
 
గుడివాడలోని కె .కన్వెంక్షన్ హాలులో కేసినో వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ఈ కేసినో ద్వారా వందల కోట్లు చేతులు మారినా ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు. చేతులకు తాళ్లు కట్టుకునే మంత్రి ప్రతి విషయానికి స్పందిస్తారన్నారు. ఈ విషయంలో  ఎందుకు మిన్నకుండిపోయారోనని ఎద్దేవా చేశారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయానికి వక్ర భాష్యం చెప్పేలా వైసీపీ నాయకత్వం వ్యవహరిస్తోందని సోము వీర్రాజు  ధ్వజమెత్తారు. 
 
 
మద్యంపై రూట్ మార్చి, జగన్  ప్రభుత్వం మోసం‌ చేసిందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఆడపడుచులకు  ఇచ్చిన హామీని గాలికి వదిలేశారన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మద్యం అమ్మకాలను ఇంకో గంటపాటు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని బీజేపీ  వ్యతిరేకిస్తోందని చెప్పారు. వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం షాపులను తెరచి ఉంచాలని,  లేకపోతే బీజేపీ ఈ సమస్యలపై ప్రజా ఉద్యమం చేస్తుందని సోము వీర్రాజు అన్నారు.