చిత్తూరు మేయర్ దంపతులు హత్య కేసు : ఐదుగురుకి ఉరిశిక్ష  
                                       
                  
				  				   
				   
                  				  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు మేయరుగా ఉన్న కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. సుమారు పదేళ్ల క్రితం 2015 నవంబరు 17న అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. 
				  											
																													
									  
	 
	 
	ఈ కేసులో ఐదుగురు నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. న్యాయస్థానం శుక్రవారం వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్(ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.
				  
	 
	ఎస్.శ్రీనివాసాచారి(ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. ఇందులో మేయర్ భర్త మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ(ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్(ఏ2), జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి(ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్(ఏ5)లు దోషులుగా తేలారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	దీంతో వారికి ఉరిశిక్ష విధించింది. దోషుల్లో ఏ1గా ఉన్న చింటూ రూ.70లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. కఠారి అనురాధ, మోహన్ వారసులకు రూ.50లక్షలు, గాయపడిన వేలూరి సతీష్ కుమార్ నాయుడికి రూ.20లక్షలు చెల్లించాలని స్పష్టం చేసింది.