శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (15:06 IST)

భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : సీఎం జగన్

jagan
ఏపీ జెన్‌కో థర్మల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పర్యటనకు వచ్చారు. ఇక్కడ నిర్మించిన ఏపీ జెన్‌కో మూడో ప్లాంట్‌ను ప్రారంభించి ప్రైవేటుకు అంకితం చేశారు. 
 
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు పడిందన్నారు. అత్యాధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్ కో స్వయంగా నిర్మించిన దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 
 
నాడు 2008లో ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని, రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దామోదరం సంజీవయ్య పేరును ఈ థర్మల్ స్టేషన్‌కు పెట్టుకున్నామని ఆయన తెలిపారు. 
 
ముఖ్యంగా దేశంలో ప్రభుత్వ రంగంలో సూపర్ టెక్నాలజీతో నిర్మితమైన తొలి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇదేనని చెప్పారు. ఈ థర్మల్ ప్లాంట్‌ కోసం కృష్ణపట్నం పోర్టు కోసం భూములిచ్చిన రైతులకు నిండు మనస్సుతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులు, జిల్లా వైకాపానేతలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.