1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (11:36 IST)

నేడు కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్.. రోడ్ల వెంబడి ఇనుప కంచెలు

ys jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి గురువారం బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఉదయం 11 గంటలకు పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు వస్తారు. ఆ తర్వాత రెండు గంటల పాటు పులివెందుల మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. 
 
పిమ్మట మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 3 గంటలకు వేంపల్లికి చేరుకుని అక్కడ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. 
 
రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకుని, తన తండ్రి వైఎస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆయన విజయవాడకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.