శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (05:15 IST)

29, 30 తేదీల్లో మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు: ఎపియుసిఎఫ్‌

రాష్ట్రవ్యాప్తంగా ఆస్తివిలువ ఆధారిత ఇంటి పన్ను, చెత్తపన్ను, నీటిపన్ను, పారిశుధ్యనిర్వహణ వివిధ రకాలుగా ప్రజలపై వేలాదికోట్ల భారాలు మోపాలని చూస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌరసమాఖ్య (ఎపియుసిఎఫ్‌) ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో అన్ని మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయనున్నామని ఎపియుసిఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు తెలిపారు.

ఎపియుసిఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశం సంఘం నాయకులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన శనివారం ఆన్‌లైన్‌లో జరిగిందని, సమావేశం ఈ మేరకు నిర్ణయం చేసిందని వివరించారు. సమావేశంలో తీసుకున్న వివిధ నిర్ణయాలను బాబూరావు విజయవాడలోని ఎంబి విజ్ఞానకేంద్రంలో విలేకరుల సమావేశం ఆదివారం నిర్వహించి వెల్లడించారు.

కరోనా కష్టాలతో ప్రజలు అల్లాడుతుంటే ఆదుకోవాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జేబులు ఖాళీచేసే చట్టాలు, జిఒలు తీసుకువచ్చి అన్యాయం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1.50కోట్ల ప్రజలపై భారాలు పన్నుల పేరుతో వేస్తోందని తెలిపారు.

కేవలం 15శాతం మాత్రమే పన్నులు పెంచుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా బుకాయిస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలపై భారాలు మోపుతున్న పాపంలో ప్రథమ ముద్దాయి కేంద్రమేనని అన్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉమ్మడిగా అన్యాయం చేస్తున్నాయని, దీన్ని ఎపియుసిఎఫ్‌ సహించేదిలేదని వెల్లడించారు. కలిసివచ్చే అన్ని పౌర, వ్యాపార,వాణిజ్య సంఘాలు, ట్యాక్స్‌,రేట్స్‌పేయర్స్‌, కాలనీ, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు అన్నిటినీ కలుపుకుని ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.

పెంచుతున్న పన్నులను ప్రజలు స్వాగతిస్తున్నారని చెబుతున్న మంత్రి బొత్స దీనిపై ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు పన్నులను నిలిపివేయాలని తెలిపారు. పన్నులపై ప్రజలు అనుకూలమా, ప్రతికూలమా తేల్చేందుకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాలను కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌లో సేకరించాలని డిమాండ్‌ చేశారు.

అదేవిధంగా వార్డు సచివాలయాల్లోనూ ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని కోరారు. లేకుంటే ఎపియుసిఎఫ్‌ ప్రజాబ్యాలెట్‌, లక్షల సంతకాల సేకరణ చేపడుతుందని తెలిపారు. మున్సిపాలిటీల్లో ఏర్పడిన కౌన్సిళ్ల అభిప్రాయం కూడా ప్రభుత్వం తీసుకోపోవడం దారుణమరు. రాష్ట్రంలోని 50లక్షల కుటుంబాలపై గృహాలు, వ్యాపార సంస్థలపై కలిపి సంవత్సరానికి రూ.750కోట్లు ప్రజలపై భారాలు మోపుతోందని తెలిపారు.

చెత్తనిర్వహణ పేరుతో బడా కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేందుకు చట్టాలు సవరణ, జిఒలు తీసుకువచ్చి వారికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మార్గం సుగమం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లీన్‌ ఎపి అంటే ప్రజల జేబులు ఖాళీ చేయడం కాదని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం తెస్తున్న కొత్తవిధానం పన్నులతో రెండింతలు, మూడింతలు పన్నులు భారం పడుతోందని, ప్రజలంతా వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఆస్తివిలువ ఆధారిత పన్నులు, చెత్తపన్నులను ప్రజలు అంగీకరించడం పులినోట్లో తల పెట్టినట్లేనని వివరించారు. పన్నులకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ఎపియుసిఎఫ్‌ కృషి చేస్తుందని, ప్రజలెవరూ మంత్రి బుకాయింపు మాటలు నమ్మవద్దని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన విద్యావిధానంతో అనేక పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని, తక్షణమే దీన్ని రద్దు చేయాలని ఎపియుసిఎఫ్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తోందని అన్నారు.