మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 28 మార్చి 2020 (19:39 IST)

ఇద్దరు సీఎంలు నా సలహాలు తీసుకోండి, తెలుగు రాష్ట్రాలకు 7వేల కోట్లిస్తా...

సార్వత్రిక ఎన్నికలకు ముందు తెగ హడివిడి చేశారు ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కె.ఎ.పాల్. తమ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమంటూ చెప్పుకొచ్చారు. కానీ ఒక్క సీటు కూడా ప్రజాశాంతి పార్టీ గెలచుకోకపోవడంతో చివరకు తిరిగి ఆంద్రప్రదేశ్ నుంచి అమెరికాకు వెళ్లిపోయారు కె.ఎ.పాల్. ఇక ఆ తరువాత కనిపించలేదు.
 
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో కె.ఎ.పాల్ అమెరికా నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతుండటం బాధాకరంగా ఉంది. నేను అమెరికాలో ఇంట్లోనే ఉంటున్నాను. బయటకు రావడం లేదు. నా ఇంటిని కూడా క్వారంటైన్‌గా వాడుకోమని నేను ప్రభుత్వాన్ని కోరాను.
 
అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్మోహన్ రెడ్డిలు నన్ను పిలిచి నాతో సంప్రదింపులు జరిపితే ఖచ్చితంగా నేను వారితో మాట్లాడుతాను. మాట్లాడడమే కాదు తెలంగాణాలో విజృంభిస్తున్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం అందించేందుకు, విరాళాలు సేకరించేందుకు నేను ముందుంటాను.
 
ఎపి సిఎంకు కూడా అదే చెబుతున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ముఖ్యమంత్రి సహాయ నిధికి 7వేల కోట్ల రూపాయల నిధులు చేకూరేలా చూడగలను. నాతో మీరు సంప్రదింపులు జరపండి... గతంలో వైజాగ్‌లో తుఫాన్ పెను బీభత్సం వచ్చినప్పుడు కూడా నేను స్పందించాను. నా వంతు ఆర్థిక సహాయం చేశాను. అప్పట్లో ముఖ్యమంత్రులు నేను చెప్పింది విన్నారు. 
 
అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య కూడా నా మాట విన్నారు. మీరు కూడా నా మాట వినండి అంటూ జగన్, కెసిఆర్‌లను కోరుతున్నారు కె.ఎ.పాల్. సెల్ఫీ వీడియోలను తీసి యుట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన కె.ఎ.పాల్‌ను చాలా మంది ప్రశంసిస్తున్నారు.