1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 మే 2021 (21:36 IST)

కోటప్పకొండలో సత్య ప్రమాణం చేసిన మాజీ ఎమ్మెల్యే.. బ్రహ్మనాయుడికి సవాల్

GV Anjaneyulu
పల్నాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వినుకొండలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు చెందిన శివశక్తి ఫౌండేషన్‌లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా... ఆరోపణలపై కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో ప్రమాణం చేయాలంటూ జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు. అంతేకాదు, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, శివశక్తి ఫౌండేషన్‌లో అవకతవకలు జరగలేదని ప్రమాణం చేశారు.
 
దీనిపై వినుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. జీవీ ఆంజనేయులు దొంగ ప్రమాణాలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే శివశక్తి ఫౌండేషన్ కార్యకలాపాల బ్యాలెన్స్ షీట్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఫౌండేషన్‌‌కు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో వెల్లడించకుండా, ప్రమాణాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ఆంజనేయులు వ్యవహారం యావత్తు మోసపూరితం అని వ్యాఖ్యానించారు.
 
ఈ నేపథ్యంలో కోటప్పకొండకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వెళ్లారు. ఎమ్మెల్యే బొల్లా ఆరోపణలపై సత్య ప్రమాణం చేస్తానని రెండు రోజుల క్రితం జీవీ ఆంజనేయులు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన సత్య ప్రమాణం చేశారు. రెండ్రోజుల క్రితం కొటప్పకొండకు వెళ్లకుండా జీవీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన సోమవారం కోటప్పకొండకు వెళ్లారు. అక్కడ దేవుని సన్నిధిలో జీవీ ఆంజనేయులు ప్రమాణం చేసారు. పేదలకు సేవ చేస్తున్నాను తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని జీవీ అన్నారు. ప్రమాణం చేసి తన మాట నిలబెట్టుకున్నానని, బ్రహ్మనాయుడు ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు.