వైకాపా అధినేత జగన్ నివాసం వద్ద ఫైర్ - సీసీటీవీ ఫుటేజీలు కోరిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు మరోమారు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన స్థానిక తాడేపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని కోరారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో జగన్ నివాసం ఉంటున్న విషయం తెల్సిందే. ఆయన ఇంటి వద్ద ఇటీవల అగ్నిప్రమాదం సంభవించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.
సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలన రెండు రోజుల క్రితం ఆ పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తికి నోటీసులు ఇవ్వగా, తమ వద్ద ఎలాంటి సీసీటీవీ ఫుటేజీ లేదని పోలీసులకు నారాయణమూర్తి సమాచారం ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని తాడేపల్లి పోలీసులు.. మరోమారు మంగళవారం కూడా నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై సీసీ టీవీ కెమెరాల వివరాలను ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.