శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2020 (20:39 IST)

వ‌ర‌ద ప్రాంతాల్లో ఉచిత రేష‌న్: జ‌గ‌న్ ఆదేశం

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టంపై అంచనాలను వెంటనే పూర్తి చేయాలని సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ సోమ‌వారం ఏరియల్ సర్వే నిర్వహించారు.

సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు మేక‌తోటి సుచరిత, కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు (నాని) ఉన్నారు. నందిగాము, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ - నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాలు, దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల‌ను పరిశీలించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తే రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే వరద ప్రాంతాల్లో నిత్యావసరాలు, ఉచిత రేషన్ అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఐదు ర‌కాల నిత్యావసర సరుకులతో కూడిన ఉచిత రేషన్‌ను ప్ర‌భుత్వం  అందిస్తుంది.