గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (16:47 IST)

గుంటూరు : హోం క్వారంటైన్‌కు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ అక్కడక్కడా ఒక్కో కేసు బయటపడుతోంది. దీంతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 13 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు కేసులు గుంటూరులో ఉన్నాయి. 
 
జిల్లాకు చెందిన ఓ పొగాకు వ్యాపారిలో తొలుత ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ఆయన భార్యకూ ఈ వైరస్ సోకింది. దీంతో వారిద్దరీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాపారికి ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. 
 
అయితే, ఈ పొగాకు వ్యాపారి స్థానిక ఎమ్మెల్యేకు బంధువు. పైగా, ఈ ఎమ్మెల్యేతో పొగాకు వ్యాపారి కలిసి మాట్లాడినట్టు, తిరిగినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఆ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. అయితే, ఆ ఎమ్మెల్యే పేరు, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనే విషయాన్ని మాత్రం అధికారులు బహిర్గతం చేయలేదు. 
 
కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ ఎమ్మెల్యే వైకాపాకు చెందిన మహ్మద్ ముస్తాఫా షేక్ అని, గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సివుంది.