1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 19 నవంబరు 2021 (11:24 IST)

చిత్తూరు జిల్లా రేణిగుంటలో వరద బీభత్సం... కూలుతున్న ఇళ్ళు

భారీ వ‌ర్షాలు చిత్తూరు జిల్లాను వ‌ణికిస్తున్నాయి. వ‌ర‌ద‌లు ముంచెత్తి ప‌ల్లెలు, పట్ట‌ణాలు కుదేల‌వుతున్నాయి. ఇళ్లు వ‌ర‌ద తాకిడికి కూలి పోతున్నాయి. జ‌నాలు హాహాకారాలు పెడుతున్నారు. భారీ వ‌ర‌ద‌తో కళ్యాణ్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. జల దిగ్బంధంలో రేణిగుంట మండలం జీవగ్రామ్, బాలాజీ నగర్ వాసులు అల్లాడుతున్నారు.  

 
స్థానిక బాలాజీ కాలనీ వాసులు వరద నీటిలో చిక్కుకున్నారు. సెయింట్ లూధరన్ చర్చ్   నీటమునిగింది.  వ‌ర‌ద విల‌య‌తాండ‌వంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బోట్ సాయంతో స్థానికులను ఒడ్డుకు చేరుస్తున్నారు. జీవగ్రామ్ ప్రజలు 60 మందికి పైగా వరదల్లో చిక్కుకున్నారు. వారిని ర‌క్షించే ప్ర‌య‌త్నంలో ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలున్నాయి.

 
గాజులమండ్యం వంతెన వ‌ర‌ద ప్ర‌మాదంలో చిక్కుకుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్ర‌యాణికుల‌ను పోలీసులు దారి మళ్లించారు. ఇక తిరుపతి స‌మీపంలోని ముండ్లపూడి స్వర్ణముఖి నదిలో ఐదు మంది గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. తిరుచానూరు వసుంధర నగర్లో స్వర్ణముఖి నది ఒడ్డున దాదాపు 10 ఇళ్లకు పైన ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఇళ్లలోనే కుటుంబాలను ఖాళీ చేయించి తిరుచానూర్ విఆర్వో ప్రసాద్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.