1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (13:45 IST)

మంత్రి బొత్స సత్తిబాబు కాళ్లు మొక్కిన జిల్లా జాయింట్ కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మరితంగా దిగజారిపోతున్నారు. అధికార వైకాపా ప్రజాప్రతినిధులకు సాగిలబడిన నమస్కారాలు చేస్తున్నారు. వంగి వంగి దండాలు పెడుతున్నారు. మరికొందరు ఐపీఎస్ లేదా ఐఏఎస్‌లు అయితే ఏకంగా కాళ్లు పట్టుకుంటున్నారు. 
 
తాజాగా విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఏకంగా మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకుని పాదాలకు నమస్కారం చేశారు. ఆయన దఫేదారు మాత్రం సంప్రదాయబద్ధంగా మంత్రికి నమస్కారం చేస్తే, జేసీ మాత్రం పాదాలకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
కొత్త సంవత్సరం సందర్భంగా మంత్రి బొత్సకు శుభాకాంక్షలు తెలిపేందుకు జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మంత్రి ఇంటికి వెళ్లారు. ఆయన వెంట దఫేదారు కూడా ఉన్నారు. రాష్ట్ర పురపాలక శాఖామంత్రిగా ఉన్న బొత్సకు జేసీ హోదాలో కిషోర్ కుమార్ పుష్పగుచ్చం అందజేశారు. ఆ తర్వాత పాదాలకు నమస్కరించారు. 
 
ఓ అత్యున్నత స్థాయి అధికారి, జిల్లాకు జాయింట్ కలెక్టరుగా ఉన్న జేసీ మంత్రి కాళ్లకు మొక్కడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం దఫేదారుకు ఉన్న జ్ఞానం కూడా జాయింట్ కలెక్టర్‌కు లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.