1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అలా చేస్తే జగన్‌ను నిలువరించలేము : సీబీఐ

తనపై దాఖలైన అవినీతి కేసుల్లో వ్యక్తిగత విచారణ నుంచి మినహాయిస్తే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరింతగా రెచ్చిపోతారని సీబీఐ అభిప్రాయపడింది. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ జగన్ తరపు న్యాయవాదులు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ తీవ్రస్థాయిలో తన వాదనలు వినిపించింది. అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడే తన బలమేంటో చూపించారని, సాక్షులను ప్రభావితం చేశారని సీబీఐ వివరించింది. ఇప్పుడాయన ప్రభుత్వాధినేతగా సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశాలున్నాయని పేర్కొంది.
 
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరే క్రమంలో ఆయన వాస్తవాలు దాచిపెట్టి న్యాయస్థానంలో పిటిషన్ వేశారని సీబీఐ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర విభజనతో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, ఇది అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమేనని సీబీఐ స్పష్టం చేసింది.
 
సీఎంగా ఉన్న ఆయనకు అనేక సౌకర్యాలు కల్పిస్తారని, ఆ సౌకర్యాలతో ఆయన హైదరాబాద్ వరకు రావడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపింది. జగన్ వ్యక్తిగతంగా హాజరు కావడం ఈ కేసులో ఎంతో ముఖ్యమని, ఆయన పిటిషన్ ను తిరస్కరించాలని సీబీఐ కోరింది.