1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (19:00 IST)

ప్రజలను దోచుకుంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వం: కాంగ్రెస్

పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ పేరుతో  అదనపు పన్నులు వేస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల నుంచి దోపిడీ చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి తూట్లు పొడుస్తున్నారని ఎద్దేవా చేశారు.

అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. ఈ దోపిడీ పాలనకు చరమగీతం పలికేలా ప్రజలు చైతన్యవంతులు కావాలని ఆయన  పిలుపునిచ్చారు. గతంలో యు పి ఏ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలపై పెట్రో భారం వేయలేదని, ప్రజా ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ అలోచించి పరిపాలన సాగించిందన్నారు.

పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై .36, డీజిల్ పై  రూ.25 పెంచిన కేంద్రం పెట్రోల్ పై  రూ.5, డీజిల్ పై  .10 తగ్గిస్తున్నట్లు ప్రకటించటం కంటితుడుపు చర్య అన్నారు.

క్రూడాయిల్ ధరలు పెరిగాయన్న కారణంతో పెట్రో ఉత్పత్తులు పెంచి సామాన్యులపై భారం వేయడం దారుణమన్నారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. 2001 నుంచి 2014 వరకు యు పి ఏ ప్రభుత్వ హయాంలో పెట్రో  ఉత్పత్తుల ధరలు నియంత్రణలో ఉన్నాయని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం వేయలేదని ఆయన స్పష్టం చేశారు.

2011-12లో 111. 63, 2012-13లో 108. 56, 2013-14లో 98. 97 డాలర్లుగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర ఉండేదని తెలిపారు. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 70, రూ 53గా ఉన్నాయని తెలిపారు. 

ప్రస్తుత బిజెపి ప్రభుత్వం హయం 2019 సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్  ధర 56.99, 2020 లో 39.68, 2021లో 47. 62 డాలర్లుగా క్రూడాయిల్ ధర ఉందని, అయినా పెట్రో ధరలను అమాంతం రూ. 115 వరకు పెంచి పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసారని శైలజనాథ్ ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్  ధరలు తగ్గినా భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం దారుణమన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోలు రూ. 110.67, డీజిల్ రూ. 96.08 గా ఉందని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం అన్ని వ్యవస్థల నూ నాశనం చేస్తూ ధరల పెరుగుదలను మాత్రమే అభివృద్ధి చేస్తోందని విమర్శించారు. పన్నుల పేరుతొ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని, ప్రభుత్వం పన్నులు పెంచకుంటే  లీటరు పెట్రోలు  రూ. 66, డీజిల్ రూ. 55 కె వచ్చేదని అన్నారు.

ఈ ధరల పెరుగుదల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతోపారు చిరు వ్యాపారుల జీవితాలు చిన్నా భిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటిలో  దోచుకుంటున్న ప్రభుత్వాలు అనాలోచిత నిర్ణయాలతో ప్రజలపై ఆర్ధిక భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జులై చివరి వారం నుంచి ఆగస్టు, సెప్టెంబరు వరకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయని, బ్రెండ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 75 డాలర్ల నుంచి 56 డాలర్ల వరకు పడిపోయిందన్నారు.  ఆ సమయంలో ధరల స్థిరీకరణ పేరుతో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించేందుకు చమురు కంపెనీలు ఆసక్తి చూపించలేదని, కంటి తుడుపు చర్యగా కేవలం రూపాయికి అటు ఇటుగా పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించారని విమర్శించారు.

పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిన చమురు ధరలు నియంత్రించాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వల్ల  వినియోగదారులపై భారం  పెరుగుతోందని విమర్శించారు. ఈ పెంపు వల్ల చిరుద్యోగులు ఆర్ధికంగా చితికి పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లకు కళ్లెం వేసేందుకు కేంద్రం పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా  తగ్గించాలని డిమాండ్ చేశారు. చమురు ధరలు పెరుగుతున్న కొద్దీ రవాణా ఛార్జీలూ ఎగబాకు తాయని, దీంతో నిత్యావసర ధరల ఆకాశన్నంటే ప్రమాదం ఉందని, ఇది గిరాకీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందన్నారు.

ఇది అటు పారిశ్రామిక రంగంతో పాటు, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అటు కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం, ఇటు రాష్ట్రాలు పెంచిన వ్యాట్ ను  సవరించి సామాన్యులకు స్వల్ప ఊరట కల్పించే ప్రయత్నం చేసినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చొరవ చూపాలని కోరారు.

ప్రభుత్వాల తీరును ఎండగట్టడంతో పాటు వారు చేస్తున్న మోసాలను ప్రతి పౌరునికి తెలియచేస్తామని స్పష్టం చేశారు. సెంచరీ దాటిన పెట్రో ధరలకు ప్రభుత్వాలు కళ్లెం వేయని పక్షంలో ఆందోళనలకు పిలుపునిస్తామని శైలజనాథ్ హెచ్చరించారు.