1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (08:52 IST)

ఫ్రీజర్ బాక్సులో ఉంచిన మృతదేహానికి చీమలు... చీమల మందు తెచ్చుకొమ్మన్న సిబ్బంది.. ఎక్కడ?

deadbody
అసలే కుటుంబ సభ్యురారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యుల పట్ల ఓ ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరు వారిని మరింత విషాదానికి గురిచేసింది. పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్‌ బాక్సులో ఉంచిన మృతదేహానికి చీమలు పట్టాయి. ఈ విషయాన్ని గమనించిన బంధువులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీసి ఆస్పత్రి ఎదుటబైఠాయించారు. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది.. చీమల మందు తెచ్చి ఇవ్వాలంటూ మృతుని బంధువులకు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఈ దారుణ ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 29వ తేదీన జమ్మలమడుగు బీసీ కాలనీలో 16 యేళ్ల బాలిక ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది. జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష అదే రోజు చేయాల్సి ఉండగా, కొన్ని కారణాలతో మరుసటి రోజుకు వాయిదాపడింది. దీంతో మృతదేహాన్ని శవాలగదిలోని ఫ్రీజర్ బాక్సులో ఉంచారు. కుటుంబీకులు మంగళవారం ఉదయం వచ్చి చూడగా, మృతదేహం చుట్టూత చీమలు ఉన్నాయి. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి సిబ్బంది వైఖరికి నిరసనగా ఆస్పత్రి ఆవరణలోనే బైఠాయించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది కూడా చీమల మందుకొని తెచ్చివ్వాలంటూ దురుసుగా సమాధానమిచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు... అక్కడకు చేరుకుని మృతురాలి బంధువులకు సర్దిచెప్పారు.