శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఇసుకపై పోరాటం... జనసేనానికి విపక్షాల సంఘీభావం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్యపై జనసేన పార్టీ పోరుబాట పట్టింది. ఇందులోభాగంగా, ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించనుంది. ఇసుకను వెంటనే అందుబాటులోకి తేవాలని, ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ఆర్థికంగా సాయం చేయాలనే డిమాండ్‌తో ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. 
 
మధ్యాహ్నం మూడు గంటలకు మద్దిలపాలెం జంక్షన్‌ నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలో భవన నిర్మాణ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల సహకారం కోరారు. అన్ని ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులకు ఫోన్లు చేసి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 
 
బీజేపీ, టీడీపీ ఇందులో పాల్గొనేందుకు అంగీకారం తెలిపాయి. అయితే బీజేపీ పాల్గొంటే అది తమకు సైద్ధాంతిక విభేదం అవుతుందని భావించి వామపక్షాలు దూరం కావాలని నిర్ణయించాయి. లాంగ్‌ మార్చ్‌లో పాల్గొనాలని తమ పార్టీ సీనియర్‌ నేతలు చింతకాలయ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కింజరాపు అచ్చెన్నాయుడులను టీడీపీ ఆదేశించింది. 
 
మరోవైపు, లాంగ్‌మార్చ్‌లో కాంగ్రెస్‌ నేతలు అనివార్య కారణాల వల్ల పాల్గొనడం లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్‌.తులసిరెడ్డి శనివారం విజయవాడలో మీడియాకు చెప్పారు. మద్దతు ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ తమకు ఫోన్‌ చేశారని, అయితే పీసీసీ చీఫ్‌ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేయడం, పార్టీలో కొంత అనిశ్చితి కారణంగా తాము లాంగ్‌ మార్చ్‌కు వెళ్లలేకపోతున్నామని చెప్పారు. 
 
కాగా, ఈ లాంగ్ మార్చ్‌కు జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు, తోట చంద్రశేఖర్‌, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, కోన తాతారావు తదితరులు లాంగ్‌ మార్చ్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.